UPI: మార్చిలో భారీగా పెరిగిన UPI లావాదేవీలు.. గతేడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో పేమెంట్లు
UPI: దేశంలో డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. క్షణాల వ్యవధిలో నగదు బదిలీ, బిల్ పేమెంట్లు జరుగుతున్నాయి. UPI సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటి వేగం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతకు పూర్వం IMPS, RTGS వంటి వ్యవస్థలు ఉన్నా, UPI అంత విరివిగా వాడుకలో ఉండేవి కావు. ప్రస్తుతం మార్కెట్లో UPI షేర్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల డేటాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసింది. గతేడాది మార్చితో పోలిస్తే ఈ తరహా చెల్లింపులు 60 శాతం పెరిగినట్లు వెల్లడించింది. రికార్డు స్థాయిలో 8.7 బిలియన్లకు చేరుకున్నట్లు స్పష్టం చేసింది. విలువ పరంగా చూస్తే 46 శాతం పెరిగి 14.05 ట్రిలియన్లకు ఎగబాకినట్లు ప్రకటించింది.

కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యత విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. తద్వారా UPI చెల్లింపుల్లో వేగవంతమైన వృద్ధి నమోదైంది. ఇదే జోరు కొనసాగిస్తూ.. ఈ ఏడాది జనవరిలో 8 బిలియన్లు, ఫిబ్రవరిలో 7.5 బిలియన్ల లావాదేవీలు UPI ద్వారా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే జనవరిలో రూ.12.98 ట్రిలియన్లు విలువైన చెల్లింపులు నమోదు కాగా.. ఫిబ్రవరిలో కొంత తగ్గి రూ.12.35 ట్రిలియన్లకు పడిపోయాయి.
అయితే ఇటీవల UPI ప్లాట్ ఫారమ్ లో లావాదేవీలు బాగా పెరిగినట్లు NPCI డేటా చెబుతోంది. ఏదైనా యాప్ ద్వారా సులువుగా బ్యాంకు ఖాతాతో లింక్ చేసుకునే అవకాశం ఉండటంతో.. ప్రజలు దీనివైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ కు అనుగుణంగా రోజుకు 1 బిలియన్ లావాదేవీలను నిర్వహించే బ్యాండ్ విడ్త్ కలిగి ఉన్నట్లు NPIC మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బే ఇటీవల వెల్లడించారు. అయితే రూపే క్రెడిట్ కార్డులను UPIకి జతచేయడానికి ఇటీవల RBI ఆమోదం తెలిపడంతో.. డిజిటల్ లావాదేవీల్లో మరింత వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications