Adani: నిన్న మార్నింగ్ సెషన్లో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ల పరుగుకు కారణమిదీ..
Adani: ఈ వారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే పెట్టుబడిదార్ల దృష్టి అదానీ షేర్లపై పడింది. దీంతో నిన్న ఆ గ్రూపు షేర్లు ఫోకస్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ 13 కోట్ల డాలర్ల క్యాష్ టెండర్ ఆఫర్ ప్రారంభించడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తద్వారా ఉదయం సెషన్ లో పోర్ట్స్ 666.75, ఎంటర్ ప్రైజెస్ 1814.90 గరిష్ఠ స్థాయికి చేరాయి.
అదానీ పోర్ట్స్ అనేది అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ప్రధాన వ్యాపారం కావడంతో, దాని షేర్ల ధరలు సైతం పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇన్వెస్టర్లు ఈ రెండింటి కొనుగోళ్లకు ఆసక్తిని కనబరిచారని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇతర గ్రూపు స్టాక్స్ లో అమ్మకాల తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర క్షీణించింది. ఉదయం లాభాలు అనంతరం పోర్ట్స్ విలువ సైతం పడిపోయింది.
అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్ల ధరలు పెట్టుబడిదారుల్లో నిన్న ఫోకస్ అవడం గురించి GCL బ్రోకింగ్ CEO రవి సింఘాల్ తన అభిప్రాయాన్ని తెలిపారు. క్యాష్ టెండర్ ఆఫర్ వార్తల నేపథ్యంలోనే షేర్ల ధరల్లో మంచి పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. ఇది అదానీ పోర్ట్స్ షేర్లకు సానుకూలంగా మారడంతో స్టాక్ ఉదయాన్నే పరుగులు పెట్టినట్లు చెప్పారు.
అదానీ పోర్ట్స్ క్యాష్ టెండర్ ఆఫర్ గురించి తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో కంపెనీ పలు విషయాలను వెల్లడించింది. ఏప్రిల్ 19 2023, ఏప్రిల్ 22 2023 మరియు ఏప్రిల్ 24 2023 తేదీల్లో తమ సంస్థకు సంబంధించిన పత్రికా ప్రకటనలను NSE, BSEలకు అందజేసింది. 2024 నాటికి స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ బకాయి ఉన్న 3.375 శాతం సీనియర్ నోట్ల ప్రీపేమెంట్ కోసం 13 కోట్ల డాలర్ల క్యాష్ టెండర్ ఆఫర్ను ప్రారంభించినట్లు చెప్పింది.
టెండర్ ఆఫర్ యొక్క ఉద్దేశ్యం కంపెనీ సమీప రుణ మెచ్యూరిటీలను పాక్షికంగా ముందస్తుగా చెల్లించడమేనని అదానీ పోర్ట్స్ స్పష్టం చేసింది. సౌకర్యవంతమైన లిక్విడిటీ స్థితిని షేర్ హోల్డర్లకు తెలియజేయడమే తమ టార్గెట్ అని పేర్కొంది. ప్రస్తుత టెండర్ విజయవంతంగా పూర్తయిన తర్వాత కంపెనీని 52 కోట్ల డాలర్లు నోట్లు అవుట్ స్టాండింగ్ ఉండవచ్చని తెలిపింది.