Casagrand: కంపెనీ అంటే ఇలా ఉండాలి.. ప్రతి ఏటా ఉద్యోగులకు విదేశీ టూర్లు.. ఈ సారి ఎక్కడికంటే..
Casagrand: అసలే ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాలేదు. ఈ సమయంలో యాజమాన్యాలు డబ్బులు ఎలా మిగుల్చుకోవాలా అని ఆలోచిస్తున్నాయి. ఈ అన్వేషణలో కంపెనీలు తమ ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి. అయితే దక్షిణ భారతదేశంలోని ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులను విదేశీ టూర్లకు తీసుకెళుతూ వార్తల్లో నిలిచింది.
కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన కాసాగ్రాండ్ గురించే. మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులను విదేశాలకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కంపెనీ 2013లో ప్రారంభించింది. అప్పటి నుంచి దీనిని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది 700 మంది ఉద్యోగులను వారం రోజుల టూర్ కోసం స్విట్జర్లాండ్ తీసుకెళుతోంది. దీనికి తోడు కంపెనీ తన ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని బోనస్ గా అందించటం గమనార్హం. కంపెనీ మంచి ఆదాయాన్ని నమోదు చేసినందున ఈ సారి ఉద్యోగులను వెకేషన్ కు తీసుకెళుతున్నట్లు సమాచారం.
ఉద్యోగుల సంతోషం..
ఈ సారి కంపెనీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ముంబై, దుబాయ్ లలో పనిచేస్తున్న ఉద్యోగులను స్విడ్జర్లాండ్ తీసుకెళుతున్నట్లు సమాచారం. ఈ ట్రిప్ సమయంలో ఉద్యోగుల విమాన టిక్కెట్లు, వసతి, ఫుడ్, ప్రయాణ ఖర్చులను పూర్తిగా కంపెనీ భరిస్తుంది. ప్రతి ఏటా కంపెనీ అమ్మకాలు పెరుగుతున్నందున ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు కంపెనీ సదుపాయాన్ని కల్పించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ వెల్లడించారు.
గతంలో ఏఏ దేశాలకు..
విదేశాలకు ఉద్యోగులను తీసుకెళ్లటం ఆనవాయితీగా పెట్టుకున్న కంపెనీ గత ఏడాది 700 మందిని దుబాయ్ కి, 900 మందిని అబుదాబీకి వెకేషన్ కోసం తీసుకెళ్లింది. దీనికి ముందు సంవత్సరాల్లో లండన్, సింగపూర్, థాయ్లాండ్, మలేషియా టూర్లకు కంపెనీ తన ఉద్యోగులను తీసుకెళ్లింది. కంపెనీ 2013లో ప్రవేశపెట్టిన బిగ్ బొనాంజా అనే ఇనిషియేటివ్లో భాగంగా దీనిని కొనసాగిస్తున్నట్లు యాజమాన్యం చెబుతోంది. ఉద్యోగులను సైతం తాము కుటుంబ సభ్యులుగా పరిగణిస్తామని అరుణ్ కుమార్ తెలిపారు. అందుకే అందరూ కలిగి వేడుగలు జరుపుకుంటామని ఆయన అన్నారు.