RBI MPC: ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తక్కువ
ద్రవ్యోల్భణం పెరుగుతున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ వారంలో జరగనున్న పాలసీ సమీక్ష సమావేశంలో అన్ని రకాల వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ వాల్ స్ట్రీట్ బ్రోకరేజీ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికన్ సెక్యూరిటీస్ ఇండియా (BofA) కూడా ఆర్బీఐ వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను కేవలం 25 బేసిస్ పాయింట్లు మాత్రమే పెంచింది. మొదటి నుండి 50 బేసిస్ పాయింట్లు పెంచుతుందని భావించినప్పటికీ, చివరకు 25 బేసిస్ పాయింట్లకు పరిమితమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించవచ్చునని అంటున్నారు.
6-8 ఎంపీసీ
ఆర్బీఐ ఇప్పటికిప్పుడు కీలక వడ్డీరేట్లని పెంచే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ నెల 6వ తేదీన ఎంపీసీ సమావేశం ప్రారంభమై, 8న ముగుస్తుంది. 8న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఎంపీసీ సమావేశం నిర్ణయాలను ప్రకటిస్తారు. ఈ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలోను ఆర్బీఐ కీలక రెపో, రివర్స్ రెపో రేట్లు స్థిరంగా కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా నమోదయింది. 8 నెలల గరిష్ఠస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం నిర్ధేశించిన దానికంటే ఇది ఎక్కువ.
ఇప్పుడే కాదు...
దీంతో ఏప్రిల్ నెల ద్రవ్య, పరపతి విధానంలో ఆర్బీఐ ఎంపీసీ 25 బేసిస్ పాయింట్ల నుండి 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు పెంచే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావించాయి. అయితే కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నందున ఈ స్థితిలో వడ్డీరేట్లు పెంచితే అందుకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. ఈ కారణంగా అభివృద్ధికి చేయూతనిచ్చే ఉద్దేశ్యంలో భాగంగా వడ్డీ రేట్ల పెంపు దిశగా ఆర్బీఐ ఆలోచించే అవకాశాలు తక్కువ అంటున్నారు. అలాగే, ప్రస్తుత ద్రవ్యోల్బణానికి చమురు సెగ మరో ముఖ్య కారణం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పూర్తిగా నిలిచిపోతే చమురు ధర 100 డాలర్ల దిగువకు వస్తుందని భావిస్తున్నారు.
ఇప్పుడు ఇలా
అలాగే, ఆర్బీఐ 2022-23 ఆర్థిక వృద్ధి అంచనాలను కొంతమేర తగ్గించవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. అదే సమయంలో విదేశీ అంశాల కారణంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయడం కోసం వృద్ధిని పూర్తిగా త్యాగం చేయకపోవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. ద్రవ్యోల్భణాన్ని ఆర్బీఐ 4 శాతం స్థాయిలో (మైనస్ లేదా ప్లస్ 2) కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.