RBI MPC: కీలక వడ్డీ రేట్లు స్థిరంగా ఉండే ఛాన్స్, వరుసగా 8వసారి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఆరుగురు సభ్యుల ఎంపీసీ తీసుకనే నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడిస్తారు. అంతర్జాతీయ కమొడిటీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడమే లక్ష్యంగా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ కారణంగా వరుసగా ఎనిమిదోసారి ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చునని భావిస్తున్నారు.
ప్రస్తుతం రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద ఉన్నాయి. ముడి చమురు, సహజ వాయువు, బొగ్గు ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయని గుర్తు చేస్తున్నారు. రేట్ల పెంపు ఉండకపోవచ్చునని, ద్రవ్యోల్బణం భరించగలిగే స్థాయిలోనే ఉండడం, టెన్ ఇయర్ బాండ్ ఈల్డ్స్ 6 శాతంపై కొనసాగుతుండడం ఇందుకు కారణమని అంచనా వేస్తున్నారు. ఆర్థిక రికవరీ సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఏడేళ్ల గరిష్టానికి పెరిగిన కమోడిటీ ధరలు, దేశీయంగాధరల తీవ్రత కట్టడి ఆవశ్యకత, రూపాయి బలహీనత, ఈక్విటీ మార్కెట్ అనిశ్చితి వంటి అంశాలు ఎంపీసీ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధరల కట్టడికి చర్యలు తీసుకుంటూనే, వృద్ధి లక్ష్యంగా యథాతథ రెపోరేటును కొనసాగించే అవకాశాలే అధికమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.