డీహెచ్ఎఫ్ఎల్ దివాలా! డైరెక్టర్ల బోర్డు రద్దు, అడ్మినిస్ట్రేటర్ నియామకం!
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) కథ ఎట్టకేలకు ముగిసింది. రుణ దాతలు, డిపాజిట్దారులకు చెల్లింపులు చేయలేక దివాలా తీసిన తొలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎన్బీఎఫ్సీ)గా ఈ సంస్థ రికార్డులకెక్కింది.
తాజాగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీపై వేటు వేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కంపెనీ డైరెక్టర్ల బోర్డును రద్దు చేయడమేకాక దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమయ్యే అడ్మినిస్ట్రేటర్ను కూడా నియమించింది.
దేశంలోని 50 భారీ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా ఎదిగి...
అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు గృహ రుణాలు ఇచ్చే ఉద్దేశంతో 1984 ఏప్రిల్ 11న రాజేష్ కుమార్ వాధ్వాన్ డీహెచ్ఎఫ్ఎల్ సంస్థను ప్రారంభించారు. మొదట దివాన్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్గా.. ఆ తరువాత దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్గా పేరు మార్చుకున్న ఈ సంస్థ తర్వాత కాలంలో దేశంలోని 50 భారీ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థకు భారీగా అప్పులిచ్చే పంజాబ్ అండ్ మహారాష్ట్ర (పీఎంసీ)బ్యాంక్ ఆ మధ్యన దివాలా తీసిన సంగతి తెలిసిందే.
అందలం నుంచి అధ:పాతాళానికి...
తన వ్యాపార కార్యకలాపాలలో భాగంగా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.31,000 కోట్ల నిధును షెల్ కంపెనీల ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ దారి మళ్లించిందని, సంస్థ ప్రమోటర్లు విదేశాల్లో అస్తులు కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగించారంటూ ఆ మధ్య ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘కోబ్రాపోస్ట్' ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలు నిరాధారమంటూ కంపెనీ ఖండించింది. మరోవైపు కార్పొరేట్ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలపై విచారణ ప్రారంభించింది. ఈ ఏడాది జూన్లో జరపాల్సిన రుణ చెల్లింపు విషయంలో డీఫాల్ట్ అవడంతో కంపెనీ మనుగడ, నిర్వహణపై సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలో నిధుల దారి మళ్లింపునకు సంబంధించి ఆధారాలు లభ్యం కావడంతో కార్పొరేట్ మంత్రిత్వ శాఖ డీహెచ్ఎఫ్ఎల్పై విచారణకు తీవ్ర నేరాల దర్యాప్తు విభాగం(ఎస్ఎఫ్ఐవో)ను ఆదేశించింది.
అవకతవకలు నిర్థారణ కావడంతో...
ఆ తరువాత కంపెనీలో చోటుచేసుకున్న అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో కేంద్రం ఈ సంస్థపై దర్యాప్తునకు ఆదేశించింది. తాజాగా ఆర్బీఐ ఈ కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించడమేకాక, డైరెక్టర్ల బోర్డును రద్దు చేసి డీహెచ్ఎఫ్ఎల్ను తన చేతుల్లోకి తీసుకుని దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు అడ్మినిస్ట్రేటర్ను కూడా నియమించడంతో దీని కథ ముగిసినట్లయింది.
కుప్పకూలిన షేరు ధర...
మరోవైపు డీహెచ్ఎఫ్ఎల్ దివాలా తీసిందనే వార్తల నేపథ్యంలో ఆ కంపెనీ షేరు ధర కుప్పకూలిపోయింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆల్టైం గరిష్ట స్థాయి రూ.692ని తాకిన డీహెచ్ఎఫ్ఎల్ షేరు ధర ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 30న అత్యంత కనిష్ట స్థాయి రూ.15కి పడిపోయింది. ఇక బుధవారం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ. 20 వద్ద ముగిసింది.
రూ.లక్ష కోట్ల వరకు అప్పులు...
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్.. నేషనల్ హౌసింగ్ బోర్డుకు, వివిధ బ్యాంకులకు, మ్యూచువల్ ఫండ్స్కు భారీ మొత్తంలో బకాయి పడింది. అంతేకాకుండా ఈ సంస్థలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిపాజిట్లు కూడా చేశారు. మొత్తంగా చూస్తే.. డీహెచ్ఎఫ్ఎల్ రూ.లక్ష కోట్ల వరకు వివిధ సంస్థలు, వ్యక్తులకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది జూలై 6 నాటికి డీహెచ్ఎఫ్ఎల్లో రూ.6,188 కోట్ల పబ్లిక్ డిపాజిట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి ఇక డీహెచ్ఎఫ్ఎల్ అప్పులు రూ.88,873 కోట్లు కాగా ఇందులో బ్యాంకులకు చెల్లించాల్సినవి రూ.38,342 కోట్లు. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే రూ.10,000 కోట్లు డీహెచ్ఎఫ్ఎల్ బకాయి పడింది.
రంగంలోకి దిగిన ఆర్బీఐ...
రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన సమస్యాత్మక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు (హెచ్ఎఫ్సీలు)ను దివాలా చట్టం (ఐబీసీ) కింద పరిష్కార చర్యల కోసం ఎన్సీఎల్టీకి ప్రతిపాదించే అధికారాన్ని ఆర్బీఐకి కట్టబెడుతూ కేంద్రంలోని మోడీ సర్కారు గత వారమే ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొన్ని నెలలుగా చెల్లింపుల విషయంలో డీహెచ్ఎఫ్ఎల్ వరుసగా విఫలమవుతుండడంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తనకు కట్టబెట్టిన అధికారాల అమలును ఆరంభించింది. ఫలితంగా దివాలా ప్రక్రియకు వెళ్లనున్న తొలి ఎన్బీఎఫ్సీ/హెచ్ఎఫ్సీ డీహెచ్ఎఫ్ఎల్ కానుంది.
డైరెక్టర్ల బోర్డు రద్దు.. అడ్మినిస్ట్రేటర్ నియామకం
డీహెచ్ఎఫ్ఎల్ యాజమాన్యంపై ఆరోపణలు, కంపెనీ నిర్వహణపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో బుధవారం ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఆర్బీఐ రద్దు చేసింది. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో అయిన ఆర్.సుబ్రమణియకుమార్ను అడ్మినిస్ట్రేటర్ (పాలనాధికారి)గా నియమించింది. ఇక జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో డీహెచ్ఎఫ్ఎల్కు సంబంధించిన దివాలా పరిష్కార ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని ఆర్బీఐ ప్రకటించింది.