HDFC బ్యాంక్కు రూ. 91 లక్షలు జరిమానా విధించిన RBI..కస్టమర్లతో గేమ్స్ ఆడొద్దని హెచ్చరిక
దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన HDFC బ్యాంక్పై.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (Banking Regulation Act), ఆర్బీఐ జారీ చేసిన పలు మార్గదర్శకాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో రూ. 91 లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
రిజర్వ్ బ్యాంక్ తెలిపిన ప్రకారం..నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనలకు సంబంధించిన లోపాలు, బ్యాంకింగ్ సేవల అవుట్సోర్సింగ్లో జరిగిన తప్పులు, వడ్డీ రేట్ల నిర్ణయంలో అనుసరించాల్సిన ప్రమాణాల ఉల్లంఘన వంటి పలు అంశాలలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు గుర్తించబడింది. దీనివల్ల వినియోగదారుల ప్రయోజనాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతకు భంగం కలిగే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది.
2024 మార్చి 31 నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షక తనిఖీ నిర్వహించింది. ఆ తనిఖీల్లో, బ్యాంక్ కొన్ని విభాగాల్లో సరైన విధానాలను పాటించలేదని, ముఖ్యంగా ఒకే రుణ విభాగంలో వేర్వేరు ప్రమాణాలు అమలు చేశారని, ఇది సమానత్వం, న్యాయబద్ధత అనే మూలబలాలకు విరుద్ధమని వెల్లడైంది. అదేవిధంగా, కొంతమంది కస్టమర్ల KYC ధృవీకరణ బాధ్యతను బ్యాంకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నట్లుగా, కస్టమర్ గుర్తింపు ధృవీకరణ బాధ్యతను పూర్తిగా ఇతర సంస్థలకు అప్పగించరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన పూర్తిగా యాజమాన్యంలోని ఒక అనుబంధ సంస్థ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన విధానం BR చట్టంలోని సెక్షన్ 6 లో పేర్కొన్న అనుమతించబడిన కార్యకలాపాల పరిధిలోకి రాదని గుర్తించారు. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని, ఆర్బీఐ... బ్యాంకుకు నోటీసు జారీ చేసి వివరణ కోరింది. బ్యాంకు సమర్పించిన సమాధానాలు, అదనపు వివరాలను పరిశీలించిన తరువాత, అభియోగాలు నిర్ధారించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని ఆర్బీఐ తేల్చింది. దాంతో జరిమానా విధించాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది.
ఈ జరిమానా పూర్తిగా చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతిలో జరిగిన లోపాల ఆధారంగా మాత్రమే విధించబడిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంక్ కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాల చెల్లుబాటు లేదా లావాదేవీల నైతికతపై దీని ప్రభావం లేదనిత తెలిపింది. అలాగే, ఈ చర్య భవిష్యత్తులో ఆర్బీఐ తీసుకునే ఇతర నియంత్రణ చర్యలకు ఎటువంటి అడ్డంకి కాదని తెలిపింది.
ఇదే సమయంలో గవర్నెన్స్ సమస్యలు, నియంత్రణ మార్గదర్శకాలను పాటించనందుకు.. రిజర్వ్ బ్యాంక్ మరో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన మన్నకృష్ణ ఇన్వెస్ట్మెంట్స్పై రూ. 3.1 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా ద్వారా వినియోగదారుల సమాచార భద్రత, పారదర్శకత, నైతిక నిబంధనల అమలు విషయంలో ఆర్బీఐ ఏ మాత్రం రాజీ పడదని ఆర్బీఐ తెలుస్తోంది. ముఖ్యంగా KYC నియమాల ఉల్లంఘనకు సంబంధించిన చర్యలు భవిష్యత్తులో మరింత కఠినతరం అయ్యే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications


