కొటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా
ప్రముఖ బ్యాంకులు కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకులకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఫైన్ వేసింది. ఒక్కో బ్యాంకుపై రూ.1 కోటి చొప్పున జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించకపోవడంతో ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. నాలుగు సహకార బ్యాంకులపై కూడా జరిమానాను కూడా విధించినట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది.
డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కు సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే, కస్టమర్ ప్రొటెక్షన్ బాధ్యతలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు కొటక్ మహీంద్ర బ్యాంకు పైన రూ.1.05 కోట్ల జరిమానాను విధించినట్లు తెలిపింది.
నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనలను పాటించనందుకు గాను ఇండస్ఇండ్ బ్యాంకు పైన రూ.1 కోటి జరిమానా విధించింది. అలాగే నవ్ జీవన్ కో ఆపరేటివ్ బ్యాంకు, బలంగీర్ జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు, ధాకురియా కో ఆపరేటివ్ బ్యాంకు, ది పళని కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పైన రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు జరిమానా విధించింది.