కార్పోరేట్... ప్రయివేటు బ్యాంకుల్లో కీలక సంస్కరణలు: వాటా 26% శాతానికి పెంపు
ప్రయివేటు బ్యాంకుల యాజమాన్యం, కార్పోరేట్ స్ట్రక్చర్ పైన భారతీయ రిజర్వ్ బ్యాంకు(RBI) ప్యానెల్ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రయివేటు రంగ బ్యాంకుల్లో పదిహేనేళ్ల తర్వాత ప్రమోటర్ల చెల్లింపు ఈక్విటీ వాటా పరిమితిని 26 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ప్రయివేటురంగ బ్యాంకుల్లో ప్రమోటర్లు తమ యాజమాన్య వాటాను మూడేళ్లలో 40 శాతం, పదిహేనేళ్లలో 15 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు చేశాక భారీ కార్పోరేట్, పారిశ్రామిక సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్స్లు ఇవ్వాలని కమిటీ సూచించింది. పర్యావరణ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని పేర్కొంది. భారతీయ ప్రయివేటు బ్యాంకుల్లో యాజమాన్యం కార్పోరేట్ స్ట్రక్చర్ మార్గదర్శకాల్ని సమీక్షించేందుకు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీకే మహంతీ నేతృత్వంలో జూన్లో కమిటీ వేశారు.
Moratorium, వారికి ప్రయోజనం అవసరం లేదు: క్రెడిట్ కార్డు కస్టమర్లకు సుప్రీంకోర్టు షాక్
జనవరి 15లోగా అభిప్రాయాలు తెలపాలని..
ప్రయివేటురంగ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితిని 26 శాతానికి పెంచాలని ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) ప్రతిపాదించింది. ప్రస్తుతం 15 శాతంగా ఉండగా పదిహేనేళ్లలో మరో 11 శాతం వాటాను పెంచుకొని, 26 శాతం ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించింది. ఆర్బీఐ వేసిన కమిటీ శుక్రవారం నివేదికను ఆర్బీఐకి సమర్పించింది. బ్యాంకింగ్ నియంత్రిత చట్టం 1949కి సవరణలు, అన్ని కోణాల్లో పరిశీలనల అనంతరం పెద్ద కార్పొరేట్లను బ్యాంకుల ప్రమోటర్లుగా అనుమతించాలని ఆర్బీఐకి సూచించింది. జనవరి 15లోగా అభిప్రాయాలను తెలుపాలని కూడా పరిశ్రమను కోరింది ఆర్బీఐ.
సవరణలు అవసరం
గతంలో ఇతర రంగాల కార్పోరేట్ దిగ్గజాలకు బ్యాంకుల్లో ప్రమోటర్లుగా అనుమతిచ్చేందుకు ఆర్బీఐ అంతగా ఆశక్తి చూపలేదు. గతంలో ప్రయివేటు బ్యాంకు లైసెన్సులను జారీ చేసినప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవడానికి కార్పోరేట్ కంపెనీలకు అనుమతులు ఇఛ్చినా చివరకు ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్ అనుభవం ఉన్న కంపెనీలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. అయితే ప్రస్తుత ప్రతిపాదనలు అమలైతే పెద్ద కార్పోరేట్లు బ్యాంకుల్లో అడుగు పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ బ్యాంకుల ప్రమోటర్లుగా పెద్ద కార్పోరేట్, పరిశ్రమ సంస్థలను అనుమతించాలంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో సవరణలు చేయాలి.
ప్రమోటరేతరుల వాటా
ప్రయివేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితి ప్రస్తుతం 15 శాతం నుండి 26 శాతానికి పెంచాలని కమిటీ సూచించింది. 15 ఏళ్లలో పెయిడప్ ఓటింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ను 26 శాతానికి చేర్చాల్సి ఉంది. ప్రమోటరేతరుల వాటాల విషయంలో 15 శాతం వద్ద పరిమతి విధించాలని సూచించింది.
ఇక కొత్త బ్యాంకుల లైసెన్స్ కోసం యూనివర్సల్ బ్యాంకులైతే మూలధనం రూ.1000 కోట్లు, చిన్న ఆర్థిక బ్యాంకులు అయితే రూ.300 కోట్లు ఉండాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ మూలధన పరిమితులు రూ.500 కోట్లు, రూ.200 కోట్లుగా ఉన్నాయి.
బ్యాంకుగా.. ఎన్బీఎఫ్సీలు
ఎన్బీఎఫ్సీలు బ్యాంకులుగా మారేందుకు కమిటీ అనుకూలంగా సిఫార్సులు చేసింది. పదేళ్ళుగా బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాల్లోని సంస్థలకు అవకాశం ఇవ్వాలని, అలాగే రూ.50వేల కోట్లు, ఆపై ఆస్తులు ఉన్న కంపెనీలకే బ్యాంకింగ్ లైసెన్స్ మంజూరు చేయాలని పేర్కొంది. బ్యాంక్ లైసెన్స్ కోసం దరఖాస్తు పెట్టుకునే వారి అర్హతలను సమీక్షించాల్సిన అవసరం ఉందని, బ్యాంకింగ్ కుంభకోణాలను అరికట్టేలా లైసెన్స్ వచ్చాక బ్యాంకు కార్పొరేట్ నిర్మాణం, ప్రమోటర్లు, ఇతర వాటాదారుల దీర్ఘకాలిక పెట్టుబడుల నిబంధనలపై మరింత దృష్టి సారించాలని తెలిపింది.