Credit Cards: రెండు ప్రైవేట్ బ్యాంకులకు RBI షాక్.. క్రెడిట్ కార్డుల జారీ నిలిపివేయాలని ఆదేశం
RBI News: భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి బ్యాంకులపై విరుచుకుపడింది. దేశంలోని రెండు ప్రముఖ బ్యాంకులకు షాక్ ఇచ్చింది. వారి బిజినెస్ లో చెప్పుకోదగిన స్థానం ఆక్రమించిన ఓ సెగ్మెంట్ పై నిషేధం విధించింది. దీంతో లోపాలను సరిచేసుకునే పనిలో ప్రస్తుతం రెండు బ్యాంకులు నిమగ్నం అయ్యాయి. త్వరలోనే తమ సేవలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.
ఫెడరల్ బ్యాంక్ సహా సౌత్ ఇండియన్ బ్యాంక్ కు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డుల జారీని తాము నిలిపివేస్తున్నట్లు ఆయా బ్యాంకులు ప్రకటించాయి. క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ప్రవర్తన నియమావళిలో ఆర్బీఐ చేసిన మార్పులకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

వన్ కార్డ్ స్కాపియా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఫెడరల్ బ్యాంక్ కో బ్రాండెడ్ కార్డులు రిలీజ్ చేస్తోంది. తద్వారా కొత్త తరం వినియోగదారులను టార్గెట్ చేసింది. అయితే తాజాగా నియంత్రణ సంస్థ ఉత్తర్వులతో తాత్కాలికంగా వాటిని నిలిపివేశామని పేర్కొంది. లోపాలను సరిదిద్దుకొని తిరిగి కొత్త కస్టమర్లను ఆన్ బోర్డ్ చేస్తామని ప్రకటించింది. గత ఏడాది చివరినాటికి క్రెడిట్ కార్డ్స్ గ్రాస్ అడ్వాన్సులు 2 వేల 778 కోట్లకు చేరుకోగా.. వాటిలో పావు వంతు కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డుల నుంచి వచ్చినదే కావడం గమనార్హం.
'ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కొత్త వినియోగదారుల ఆన్బోర్డింగ్ నిలిపివేశాం. రెగ్యులేటరీ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ త్వరలోనే కొత్త కార్డుల జారీని తిరిగి ప్రారంభిస్తాం' అని సౌత్ ఇండియన్ బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులకు మాత్రం తమ సేవలను కొనసాగిస్తామని రెండు బ్యాంకులూ స్పష్టం చేశాయి.


Click it and Unblock the Notifications