Bank of Baroda: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను భారతీయ రిజర్వు బ్యాంక్ నియంత్రిస్తుంది. ఈ క్రమంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. రూల్స్ పాటించని సమయంలో భారీగా పెనాల్టీలు కూడా వేస్తుంటుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మెటీరియల్ సూపర్వైజరీ ఆందోళనలను ఉటంకిస్తూ.. బ్యాంక్ ఆఫ్ బరోడా 'bob World' మొబైల్ యాప్లో కొత్తగా కస్టమర్లను ఆన్బోర్డింగ్ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. మొబైల్ అప్లికేషన్లో ఆన్బోర్డింగ్ చేసే పద్ధతిలో గమనించిన కొన్ని మెటీరియల్ సూపర్వైజరీ సమస్యల కారణంగా సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వార్తలతో నేడు స్టాక్ మార్కెట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2 శాతానికి పైగా పతనమయ్యాయి.

ఇదే క్రమంలో ఇప్పటికే ఆన్బోర్డ్లో ఉన్న 'bob World' కస్టమర్లు తాజా సస్పెన్షన్ కారణంగా ఎటువంటి అంతరాయాలను ఎదుర్కోకుండా చూసుకోవాలని ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకును ఆదేశించింది. అప్లికేషన్లో బ్యాంక్ ఖాతాదారులను ఇకపై ఆన్బోర్డింగ్ చేస్తే.. గమనించిన లోపాలను సరిదిద్దిన తర్వాత సంబంధిత ప్రక్రియలను ఆర్బీఐ సంతృప్తిపరిచేలా బలోపేతం చేయడం జరుగుతుందని రిజర్వు బ్యాంక్ తన సర్క్యులర్లో అక్టోబర్ 10, 2023న పేర్కొంది.

దీనికి ముందు అక్టోబర్ 9, 2023న ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్డ్ డిపాజిట్(FD) రేట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముందుగా 3 ఏళ్ల వరకు కాలానికి చేసే డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీని పెంచింది. ఈ రేటు అక్టోబర్ 9 నుంచి రూ.2 కోట్ల కంటే తక్కువ మెుత్తం డిపాజిట్లపై వర్తిస్తుందని బ్యాంక్ పేర్కొంది. 2-3 ఏళ్ల మధ్య కాలానికి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లపై ప్రస్తుతం 7.90 శాతం వరకు వడ్డీని అందిస్తున్నట్లు సంస్థ అధికారి వెల్లడించారు.


Click it and Unblock the Notifications