RBI MPC meeting: వడ్డీ రేట్లు యథాతథం, భారత్ మంచి స్థానంలో ఉంది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేటును స్థిరంగా కొనసాగించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు సమావేశమై, కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు (శుక్రవారం, అక్టోబర్ 8) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రివర్స్ రెపో రేటును, రెపో రేటును స్థిరంగా కొనసాగించింది. వరుసగా ఎనిమిదో సారి రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంతదాస్ తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించేందుకు 5-1 ఓట్లు పడ్డాయి. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు.
ప్రస్తుతం కరోనా నుండి కోలుకొని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, మంచి రికవరీతో భారత్ ఇప్పుడు మంచి స్థానంలో ఉందని శక్తికాంత దాస్ అన్నారు. గత ఏఎంపీసీ సమావేశం సమయంతో పోలిస్తే ఇప్పుడు బాగుందని చెప్పారు. వృద్ధి క్రమంగా మెరుగుపడుతోందని, ద్రవ్యోల్భణం అంచనాలకు మించి ఉందని తెలిపారు. ఇంధన పన్నులు ద్రవ్యోల్భణం తగ్గుదలకు దోహదం చేస్తాయన్నారు. అంచనాల కంటే ద్రవ్యోల్భణం తక్కువగా ఉందన్నారు. సమష్టి డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, అయినప్పటికీ కాస్తనెమ్మదిగా ఉందని, ఆ పండుగ సీజన్ పట్టణ డిమాండ్ను తీర్చేవిధంగా ఉండాలన్నారు.
క్రితం మానిటరీ పాలసీ సందర్భంగా శక్తికాంత దాస్ మాట్లాడుతూ కేంద్ర బ్యాంకు రెపో రేటును ప్రస్తుతం స్థిరంగా కొనసాగిస్తుందని, అలాగే, వృద్ధికి మద్దతు ఇవ్వడానికి అవసరమున్నంత వరకు ఇలాంటి అనుకూల వైఖరిని కొనసాగిస్తుందని కూడా అప్పుడే స్పష్టం చేశారు. ఇప్పుడు దానిని కొనసాగించారు. పండుగ డిమాండ్ నేపథ్యంలో వినియోగంపై ఆర్థిక వ్యవస్థ ఎంతో ఆసక్తిగా ఉందని, ఈ నేపథ్యంలో పాలసీ వడ్డీ రేటుకు సంబంధించి ఆశ్చర్యకర నిర్ణయాలు ఉంటాయని తాము ఆశించడం లేదంటూ.. వడ్డీ రేటు సవరణ ఉండదని ఆర్థిక నిపుణులు ఇప్పటికే అభిప్రాయపడ్డారు.