RBI Monetary Policy: వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవచ్చు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ ఈ రోజు (శుక్రవారం, ఏప్రిల్ 8) ఉదయం పది గంటలకు ఆర్బీఐ విధాన పరపతి సమీక్ష సమావేశం వివరాలను మీడియాకు వెల్లడిస్తారు. 6న ప్రారంభమైన MPC సమావేశం నేడు ముగిసిన అనంతరం ఆయన మీడియా ముందుకు వస్తారు. వడ్డీ రేట్ల మార్పు, ద్రవ్యోల్భణం అంచనాలు, జీడీపీ అంచనాలను వెల్లడిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని, అలాగే, పాలసీకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అనంతరం చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో దిగుమతుల భారం పెరిగి, ద్రవ్యోల్భణం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్భణాన్ని తగ్గించే చర్యలపై ఆర్బీఐ దృష్టి సారిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, FY23 ఆర్బీఐ సీపీఐ ద్రవ్యోల్భణ అంచనాలను 4.5 శాతానికి సవరించే అవకాశాలు ఉన్నాయని, అలాగే, రియల్ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతానికి సవరించవచ్చునని భావిస్తున్నారు. FY23 సగటు సీపీఐ ద్రవ్యోల్భణ అంచనాలు 5.5 శాతం (అప్ రిస్క్), రియల్ జీడీపీ గ్రోత్ రేట్ 7.9 శాతం(డౌన్ రిస్క్)గా ఉండవచ్చునని బోఫా సెక్యూరిటీస్ రిపోర్ట్ అంచనా వేసింది.
వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగిస్తే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపడే అవకాశముంటుంది. వివిధ సంస్థలు చేసిన సర్వేలో కూడా ఆర్థిక నిపుణులు వడ్డీ రేట్లను ఈసారి కూడా స్థిరంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.