అంచనాల కంటే ముందుగానే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచాల్సిందేనా
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కరోనా కారణంగా 2020లో వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దశాబ్దాల కనిష్టం వద్ద ఉన్న వడ్డీ రేటును ఇటీవల వరుసగా ఎనిమిదోసారి స్థిరంగా కొనసాగించింది. దీంతో బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణ వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఈసారి వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తుందని ఆర్థికవేత్తలు ముందుగానే అంచనా వేశారు. ఆర్థికవేత్తల అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేట్లను ఆర్బీఐ స్థిరంగా కొనసాగించింది. అయితే త్వరలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నాయని చెబుతున్నారు.
ఇంధన సుంకాల తగ్గింపుతో భర్తీ
ఆర్బీఐ వడ్డీ రేట్లను అంచనాల కంటే ముందుగానే పెంచవలసి ఉంటుందని, ఎందుకంటే ఇది వేగవంతమైన ధరల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేంద్ర బ్యాంకు 100 బేసిస్ పాయింట్ల మేర పెంచవలసి ఉంటుందని, ఈ ధరల పెరుగుదల సర్వీస్, కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలకు విస్తరిస్తుందని, తద్వారా ఇన్పుట్ కాస్ట్స్ 15 శాతం నుండి 21 శాతం పెరుగుతాయని అంటున్నారు.
నవంబర్ నెలలో సీపీఐ ద్రవ్యోల్భణం ఏడాది ప్రాతిపదికన 4.9 శాతానికి పెరిగింది. అక్టోబర్ నెలలో ఇది 4.5 శాతంగా నమోదయింది. ఇది అంచనలు (5.1) శాతం కంటే తక్కువే. అయితే కోర్ ద్రవ్యోల్భణం మాత్రం 5.9 శాతం నుండి 6.1 శాతానికి పెరిగింది. సీపీఐ బాస్కెట్లో వ్యక్తిగత సంరక్షణ, దుస్తులు, వినోదం, గృహోపకరణ వస్తువులు, సేవలలో అధిక పెరుగదల, ఇంధనం ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ద్వారా భర్తీ అయింది.
ద్రవ్యోల్భణం పెరుగుదల
గత కొద్ది త్రైమాసికాలుగా వివిధ రంగాల్లో ద్రవ్యోల్భణం భారీగా పెరిగింది. కొన్నింటి ధరలు 40 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్లు ఎడెల్విసిస్ రీసెర్చ్ తెలిపింది. చాలా కంపెనీలు కూడా ఈ కరోనా కాలంలో ధరలు పెంచినట్లు తెలిపారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ FY22కు గాను సీపీఐ ద్రవ్యోల్భణ అంచనాలను 5.3 శాతంగా అంచనా వేస్తోంది. మూడో త్రైమాసికంలో 4.5 శాతం నుండి 5.1 శాతానికి, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతం నుండి 5.7 శాతానికి పెంచింది.
ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ నోమురా ద్రవ్యోల్భణం అంచనాలను డిసెంబర్ నెలలో ఏడాది ప్రాతిపదికన 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తోంది. 2022 మొదటి త్రైమాసికంలో 6 శాతంగా ఉంటుందని భావిస్తోంది.
రెపో రేటు స్థిరంగా..
RBI గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం (డిసెంబర్ 8) ద్వైపాక్షిక సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. రెపో రేటును స్థిరంగా 4 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు దాస్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు అవసరమైనంత కాలం ఈ వడ్డీ రేటును అనుకూలంగానే కొనసాగిస్తామని తెలిపారు. రివర్స్ రెపో రేటును కూడా స్థిరంగా 3.35 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించాలని ఎంపీసీ 5:1తో నిర్ణయించింది. రియల్ జీడీపీ వృద్ధి రేటును 9.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు.