కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేందుకు వరుసగా వడ్డీ రేట్లు తగ్గిస్తోంది కేంద్ర బ్యాంకు. ఆగస్ట్ 4వ తేదీ నుండి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) మరోసారి భేటీ కానుంది. కునారిల్లిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఈసారి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం
ఈ చర్యల్లో భాగంగా ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గించే సూచనలు ఉన్నాయి. ఆగస్ట్ 4వ తేదీ నుండి 6వ తేదీ మధ్య జరిగే ద్రవ్య విధాన కమిటీ(MPC) భేటీలో వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. MPC సమావేశంలో రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు(0.25 శాతం), రివర్స్ రెపో రేటు 35 బేసిస్ (0.35 శాతం) పాయింట్లు తగ్గించే అవకాశముందని అంచనా. కరోనా కారణంగా గత కొద్ది రోజుల్లో వడ్డీ రేట్లు 115 బేసిస్ పాయింట్లు తగ్గాయి. మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తే హోమ్ లోన్, పర్సనల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు మరింతగా తగ్గే అవకాశం ఉంటుంది.

గాడిలో పెట్టేందుకు వడ్డీ రేటు తగ్గింపు
బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఉంచే మిగులు నిధులపై కేంద్ర బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు. కరోనా, లాక్ డౌన్ వల్ల నీరసించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వడ్డీరేట్లు తగ్గించడం తప్ప ఆర్బీఐకి మరో మార్గం లేదని భావిస్తున్నారు.

లోన్ మారటోరియం పొడిగిస్తారా?
కరోనా కారణంగా మార్చి నుండి ఏప్రిల్ వరకు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీనిని డిసెంబర్ వరకు లేదా మరో ఆరు నెలలు పొడిగించాలని ఎంఎస్ఎంఈలు సహా వివిధ వర్గాల నుండి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోన్ మారటోరియంపై కూడా ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా తెలియాల్సి ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నందున లోన్ మారటోరియం పొడిగింపు అవసరం లేదని ఎస్బీఐ చైర్మన్ సహా పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇది బ్యాంకులకు కూడా ఇబ్బందికరంగా మారింది.


Click it and Unblock the Notifications