Shaktikanta Das: బ్యాంకులకు RBI గవర్నర్ సూచన.. దీపం ఉన్నప్పుడే అంటూ..!
Shaktikanta Das: అమెరికా యూరప్ లలోని బ్యాంకింగ్ సంక్షోభం దావానలంగా మారే ప్రమాదం ఉందని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే కుప్పకూలిన శ్రీలంక.. అదే దారిలో ఉన్న పాకిస్థాన్ వంటి దేశాలు ప్రపంచానికి పెద్ద సవాళ్లను తీసుకురానున్నాయి. ఈ క్రమంలో భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక సూచనలు చేశారు.
దేశీయ బ్యాంకులు తమ మూలధనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టమైన సంకేతాలు పంపారు. దీనికి తోడు సెంట్రల్ బ్యాంక్ బ్యాంకుల వ్యాపార నమూనాలను మరింత నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది. అమెరికాలోని బ్యాంకింగ్ సంక్షోభం తర్వాత ప్రజలు సైతం బ్యాంకుల బలాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలోని సంక్షోభం అలజడి రేపుతోందని తెలుస్తోంది. బ్యాంకులు, రెగ్యులేటర్లు రిస్క్ అసెస్మెంట్లో వైఫల్యం పూర్తి స్థాయి బ్యాంకింగ్ సంక్షోభానికి దారితీసిన అమెరికా, యూరోపియన్ ఎపిసోడ్ల నుంచి RBI తాజా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే భారతీయ బ్యాంకులు చాలా జాగ్రత్తగా రిజర్వు బ్యాంక్ ఆధ్వర్యంలో నియంత్రించబడుతున్నాయని తెలుస్తోంది.
యెస్ బ్యాంక్, DHFL, IL&FS పరిణామాల తర్వాత దేశంలోని బ్యాంకుల పనితీరును వాటి పెట్టుబడులు, రుణ పోర్ట్ ఫోలను రిజర్వు బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తోంది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతం కాకుండా చూసేందుకు ఎన్పీఏలను తగ్గించేందుకు దేశంలోని బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో నాణ్యత, చట్టబద్ధమైన బ్రాంచ్ ఆడిట్ల కవరేజీని కూడా ఆర్బిఐ తాజాగా అంచనా వేస్తోంది. ఈ క్రమంలో చెడు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని శక్తికాంత దాస్ దేశంలోని బ్యాంకులకు సూచించారు.


Click it and Unblock the Notifications