షాకింగ్: SBI బ్యాడ్ లోన్లు రూ.12,000 కోట్లు, తగ్గించి చూపిన బ్యాంకు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను లాభాలను చూపించింది. కానీ చూపించిన లాభాల కంటే ఎనిమిది రెట్ల లాభాలు ఉన్నట్లుగా తేలింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,932 కోట్ల నిరర్థక ఆస్తులను (NPA) SBI తక్కువగా చూపించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదిక తెలిపింది.
డిసెంబర్ 31వ తర్వాత ఈ డెబిట్ కార్డులు బ్లాక్ అవుతాయి, మార్చుకోండి
లాభానికి బదులు నష్టం
ఎన్పీఏలకు ఎస్బీఐ తక్కువ కేటాయింపులు జరిపిందని ఆర్బీఐ గుర్తించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ తేడా రూ.12,036 కోట్ల మేర ఉందని తెలిపింది. ఇంతమేర కేటాయింపులు జరిపి ఉంటే గత ఆర్థిక సంవత్సరంలో రూ.862 కోట్ల లాభానికి బదులు రూ.6,968 కోట్ల నష్టాన్ని ప్రకటించాల్సి వచ్చేదని పేర్కొంది.
రూ.7వేల కోట్ల నష్టం
కానీ ఎస్బీఐ ఈ ఏడాది మే నెలలో రూ.862 కోట్లు (2018-19 ఆర్థిక సంవత్సరానికి) లాభం వచ్చినట్లు ప్రకటించింది. కానీ తాజా ఎన్పీఏల నేపథ్యంలో దాదాపు రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లిందని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు విడుదల చేసిన ఓ ప్రకటనలో బ్యాంకు స్పష్టం చేసింది. ఆర్బీఐ రిస్క్ అసెస్మెంట్ రిపోర్టులో ఎస్బీఐ అదనపు ఎన్పీఏలు వెలుగుచూశాయి.
ఇదీ లెక్క
ఎస్బీఐ ప్రకారం స్థూల నిరర్థక ఆస్తులు రూ.1.72 లక్షల కోట్లు. కానీ ఆర్బీఐ ప్రకారం ఈ నిరర్థక ఆస్తులు రూ.1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే నికర నికర ఎన్పీఏలు ఎస్బీఐ ప్రకారం రూ.65,895 కాగా, ఆర్బీఐ అంచనా ప్రకారం రూ.77,827 కోట్లుగా ఉంది. దీంతో ఆర్బీఐ, ఎస్బీఐ లెక్కలకు మధ్య రూ.11,932 కోట్ల తేడా ఉంది. ఫలితంగా నిబంధనల ప్రకారం బ్యాలెన్స్ షీట్లో ఎన్పీఏలకు అదనంగా రూ.12,036 కోట్లను ఎస్బీఐ కేటాయించింది. దీంతో రూ.6,968 కోట్ల నష్టం వచ్చింది.
అందుకే.. ఇలా
RBI అంచనాలతో పోలిస్తే తమ ఆస్తుల వర్గీకరణ, కేటాయింపుల్లో వ్యత్యాసం ఉండటం వల్లే ఇలా జరిగిందని ఎస్బీఐ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం థర్డ్ క్వార్టర్లోని స్థూల నిరర్థక ఆస్తులపైనా రూ.3,143 కోట్ల వరకు ఈ ప్రభావం ఉండవచ్చునని తెలిపింది. ప్రొవిజన్స్పై కూడా రూ.4,654 కోట్ల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఇటీవల మొండి బకాయిలను బ్యాంకర్లు దాచిపెట్టిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని రుణాలను వెంటనే ఎన్పీఏలుగా ప్రకటించడం కుదరదని, తర్వాత కాలంలో అవి మొండి బకాయిలుగా మారుతుండటం వల్ల ఈ తేడాలు అని చెబుతున్నారు.