రాష్ట్ర ప్రభుత్వాలకు RBI భారీ ఊరట, OD సరళతరం: గడువు 50 రోజులకు పెంపు
కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవడానికి దేశ బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని వర్గాలను ఆదుకోవడానికి ఆర్బీఐ తనవంతు సహకారాన్ని అందిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్య నిబంధనలను సరళతరం చేసినట్లు చెప్పారు. దీంతో గతంలో 36 రోజుల వరకు ఉండే గడువు, ఇప్పుడు 50 రోజులకు పెంచింది.
యూకే-భారత్ భారీ డీల్: అక్కడ సీరమ్ భారీ పెట్టుబడులు
భారత్ పరిస్థితి మారిపోయింది
తదుపరి ఏడాది పాటు, ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్డౌన్లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేయనున్నాయని శక్తికాంతదాస్ అన్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ వర్గాలన్నీ కృషి చేయాలని, దీనిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కేసుల సంఖ్య రెండు కోట్లు దాటిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు నియంత్రణలోకి వచ్చిన కరోనా ఆ తర్వాత ఉధృతమైందని గుర్తు చేశారు. కరోనాను పారద్రోలేందుకు అన్ని వనరులను వినియోగించాలన్నారు. నిన్నటి వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉందని, భారత్ బలంగా ఉందని, ఇప్పుడు భారత్ పరిస్థితి మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
మారటోరియంపై...
ఏప్రిల్ మధ్యంతర పరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఇతర సంచలన నిర్ణయాలు తీసుకోవాలని భావించడం లేదన్నారు. ద్రవ్య లభ్యత నిమిత్తం ఎటువంటి అటంకాలు లేకుండా చూస్తామని, రెపో రేటును మార్చి 2022 వరకు ఓపెన్గానే ఉంచుతామన్నారు. సులువుగా రుణాలు అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రాధాన్యతా అవసరాలను బట్టి ఈ రుణాల వితరణ ఉండాలన్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు దీర్ఘకాల రెపో నిర్వహణ కింద రూ.10 వేలకోట్లను అందిస్తామని చెప్పారు. గతంలో రెండేళ్ల పాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియంను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. భారత్ భవిష్యత్తు అనిశ్చితిలో ఉందని, దానిని తొలగించేందుకు తక్షణ చర్యలు అవసరమన్నారు.
విదేశీ మారక నిల్వలు
విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతం 588 బిలియన్ డాలర్లు ఉన్నాయని, అది దేశాన్ని కరోనా నుండి కాపాడుతుందనే నమ్మకముందన్నారు. చిన్న, మధ్య తరహా కంపెనీలకు వన్ టైం వర్కింగ్ కాపిటల్ కింద ఇచ్చిన నిధులపై బ్యాంకులు నిబంధనలను సరళతరం చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. కరోనా వైద్య సదుపాయాల పెంపుకు రూ.50వేల కోట్ల నిధులను బ్యాంకులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. రూ.25 కోట్ల వరకు రుణాలు తీసుకున్న వ్యక్తులు రీస్ట్రక్చర్ చేసుకోవడానికి మరోసారి అవకాశమిచ్చింది