లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభం: డిపాజిటర్లకు షాక్... విత్డ్రా పరిమితి, DBSలో విలీనం!
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు(LVB)పై కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు మారటోరియం విధించింది. నవంబర్ 17వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి డిసెంబర్ 16 వరకు మారటోరియం అమలులో ఉంటుంది. మారటోరియం కాలంలో రిజర్వ బ్యాంక ఆఫ్ ఇండియా(RBI) నుండి ఎటువంటి రాతపూర్వక అనుమతి లేకుండా డిపాజిటర్లకు రూ.25,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులు చేయడానికి బ్యాంకుకు అనుమతిలేదు.
రూ.25,000 కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపు చేయాలంటే బ్యాంకింగ్ రెగ్యులేటర్ అనుమతి తప్పనిసరి. పెళ్లి, వైద్యం వంటి ఖర్చుల కోసం అనుమతితో రూ.25,000 కంటే ఎక్కువ తీసుకోవచ్చు. మారటోరియం కాలంలో బ్యాంకు పైన అన్ని చర్యలు, చర్యల ప్రారంభం లేదా కొనసాగింపు ఉంటుంది.
లక్ష్మీ విలాస్ బ్యాంకుపై తాత్కాలిక మారటోరియం, విత్డ్రా పరిమితి రూ.25,000
మారటోరియం.. డీబీఎస్లో విలీనం
LVBని మళ్లీ గాడిలో పెట్టేందుకు, డిపాజిటర్లతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ ప్రయోజనాల్ని కాపాడేందుకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని 45వ సెక్షన్ కింద మారటోరియం విధించాలని కేంద్రానికి సూచించామని, ఇంతకుమించి మరో ప్రత్యామ్నాయం లేకపోయిందని, మంగళవారం నుంచి 30 రోజులపాటు ఇది అమల్లో ఉంటుందని ఆర్బీఐ తన ప్రకటనలో వివరించింది. డీబీఎస్ బ్యాంకులో LVBని విలీనం చేసేందుకు ఉద్దేశించిన డ్రాఫ్టును పబ్లిక్ డొమైన్లో పెట్టినట్టు కూడా తెలిపింది.
ఉపసంహరణపై రూ.25వేలకు పరిమితం చేస్తూ నిర్ణయం ప్రకటించిన వెంటనే LVBని డీబీఎస్తో విలీనం చేసే పథకాన్ని మంగళవారం ఆర్బీఐ ప్రకటించడం గమనార్హం. రుణవృద్ధి పెరగడం కోసం డీబీఐఎల్ (డీబీఎస్ బ్యాంకు ఇండియా) రూ.2500 కోట్ల అదనపు మూలధనాన్ని జొప్పిస్తుంది. సింగపూర్కు చెందిన డీబీఎస్ బ్యాంకు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ డీబీఐఎల్.
ఆర్బీఐ ఆదీనంలోకి..
ఆర్థికశాఖతో సంప్రదింపుల అనంతరం ఆర్బఐ.. LVB బోర్డును 30 రోజులపాటు తన ఆధీనంలోకి తీసుకుంది. కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్ని బ్యాంకు అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. మారటోరియం విధింపు నేపథ్యంలో ఆందోళన అవసరం లేదని డిపాజిటర్లకు సూచించింది.
బ్యాంకు షేరు మంగళవారం 1 శాతం నష్టంతో రూ. 15.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆర్బీఐ మారటోరియం ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో బుధవారం మరింత కుగింది. ఏకంగా 20 శాతం మేర నష్టపోయి రూ.12.45 వద్ద ట్రేడ్ అయింది.
LVB బ్యాంకు గురించి..
రామలింగ చెట్టియార్ నాయకత్వంలో ఏడుగురు సభ్యుల బృందం 1926లో lvb బ్యాంకును ప్రారంభించారు. ఈ బ్యాంకు కార్యకలాపాలు 19 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి విస్తరించాయి. మొత్తం 566 బ్రాంచీలు, 918 ఏటీఎంల ద్వారా సేవలు అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 50 శాఖల వరకు ఉన్నాయి. బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.522 కోట్ల వరకు ఉంటుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.396 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. బ్యాంకు నికర ఎన్పీఏలు 7 శాతంగా ఉన్నాయి. బ్యాంకులో ప్రమోటర్ల వాటా 6.8 శాతంగా ఉంది.
విలీన యత్నాలు
మూలధన అవసరాలు తీర్చుకునేందుకు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో విలీనమయ్యేందుకు LVB గత ఏడాది మే నెలలో ఆర్బీఐ అనుమతి కోరింది. ఈ ప్రతిపాదనకు నో చెప్పింది. ఆ తర్వాత ఫిన్టెక్ కంపెనీ క్లిక్స్ గ్రూప్లో విలీనమయ్యేందుకు జూన్ 15న LVB ప్రాథమిక, విధిగా పాటించాల్సిన అవసరం లేని ఒప్పందం కుదుర్చుకుంది. విలీనంలో జాప్యం చోటు చేసుకుంది. క్లిక్స్ గ్రూప్ కూడా ఈ ఒప్పందం నుండి బయటకు వెళ్తుందనే సంకేతాలు వచ్చాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ జోక్యం చేసుకుంది. ఈ బ్యాంకు మూడేళ్లుగా నష్టాల్లో ఉంది. మొండి బకాయిలు పెరిగాయి.