Rupee VS Doller: రూపాయి చెల్లింపులకు అనుమతించిన RBI.. రూపాయి విలువ రూ.80 తాకుతుందా..? ఫుల్ స్టోరీ..
Rupee VS Doller: ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థకైనా కీలకమైనది కరెన్సీ. దాని విలువను జాగ్రత్తగా కాపాడుతుంటాయి సెంట్రల్ బ్యాంకులు. ప్రస్తుత గ్లోబలైజేషన్ సమయంలో ప్రతి దేశం ఇతర దేశాలతో ఏదో ఒక రూపంలో వాణిజ్యాన్ని కలిగి ఉంది. అంటే చెల్లింపులకు డాలర్ లేదా ఇతర సెటిల్ మెంట్ మార్గాల్లో కరెన్సీలు ఇప్పుడు కీలకంగా మారాయి. పైగా ద్రవ్యోల్బణ సమయంలో కరెన్సీల విలువ పడిపోతే అతి ఆర్థిక వ్యవస్థలకు మరింత భారంగా మారుతుంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలు చాలా నేర్చుకోవాల్సి ఉంది. అయితే మన దేశంలోనూ ప్రస్తుతం రూపాయి విలువ పతనం తీవ్ర సమస్యగా మారింది. రిజర్వు బ్యాంక్ చర్యలు చేపట్టినప్పటికీ డాలర్ విలువ బలంగా ఉండటం వల్ల పతనం కొనసాగుతూనే ఉంది. రూపాయి కొత్త కనిష్ఠాలకు దిగజారుతోంది. రూపాయి విలువ విషయంలో ఈ వారం గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రూపాయితో చెల్లింపులకు అనుమతి..
ఎగుమతులపై దృష్టి సారించి ప్రపంచ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడానికి, భారత కరెన్సీలో వాణిజ్య చెల్లింపులకు మద్దతు ఇవ్వడానికి RBI వీలుకల్పించింది. ఇందుకు వీలుగా సోమవారం ఫారెన్ ట్రేడింగ్ లో రూపాయి సెటిల్మెంట్ వ్యవస్థను ఆవిష్కరించింది. కొత్త విధానం ప్రకారం.. ఎక్స్ పోర్టర్స్, ఇంపోర్టర్స్ రసీదులు, చెల్లింపుల కోసం ప్రత్యేక వోస్ట్రో ఖాతాను(special vostro accounts) ఉపయోగించవచ్చు.
తరలిపోతున్న డాలర్..
ఈ సంవత్సరం భారతదేశం నుంచి భారీగా డబ్బు తరలిపోతున్న నేపథ్యంలో రూపాయి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సంవత్సరం ప్రారంభంలో US డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ. 74 నుంచి దాదాపు 6.7% వరకు క్షీణించింది.
విలువ కోల్పోతున్న కరెన్సీలు..
అనిశ్చిత గ్లోబల్ ఎకానమీ వల్ల ప్రతికూలంగా దెబ్బతిన్న ఏకైక కరెన్సీ రూపాయి మాత్రమే కాదు. అమెరికా ఫెడ్ చర్యల కారణంగా.. జపనీస్ యెన్, పోలిష్ జ్లోటీ, చిలీ పెసో, థాయ్ బాట్ దారుణంగా దెబ్బతిన్నాయి. వీటికి తోడు ప్రపంచంలోని అనేక ఇతర దేశాల కరెన్సీలు సైతం భారీగా తమ విలువను కోల్పోయాయి.
ప్రధాన కారణాలు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇది ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను పెంచటంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధ పరిస్ధితులకు అమెరికా పరోక్షంగా కూడా కారణంగా నిలిచింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణ అమెరికా చేపట్టిన దూకుడు చర్యల కారణంగా రూపాయి విలువ మరింతగా దిగజారింది.
కొనసాగుతున్న రూపాయి పతనం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ రంగంలోకి దిగినప్పటికీ.. రూపాయి మొదటిసారి మే నెలలో 77 మార్కును, జూన్లో 78 మార్కును, ఈ నెలలో 79 స్థాయిని అధిగమించి ట్రేడ్ అవుతోంది. ఆర్బీఐ డాలర్లను విక్రయించింది, ఫారెక్స్ ఇన్ఫ్లోలను పెంచడానికి చర్యలు ప్రకటించింది, ఇదే క్రమంలో రూపాయికి దన్నుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై పన్నును కూడా విధించింది.
తర్వాత పరిస్థితి ఏమిటి..?
రూపాయి సోమవారం నాడు డాలర్తో 79.49 కనిష్ట స్థాయిని తాకింది. ఇంట్రాడే ట్రేడింగ్ తరువాత చివరికి 79.45 వద్ద ముగిసింది. ఫెడరల్ రిజర్వ్ హాకిష్ వైఖరి కారణంగా రూపాయి దారుణమైన పతనం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ వారం డాలర్తో రూపాయి మారకం విలువ 80 మార్క్ను దాటుతుందా? అనే విషయం వేచి చూడాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం రూ.80 మార్క్ తాకవచ్చని అంటున్నారు.