Layoffs in Tata firm: రతన్ టాటాకు ఉన్న మంచి మనసు గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే సాధ్యమైనంత వరకు వారిని ఆదుకోవాలని ప్రయత్నిస్తారు. దేశ వ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ కూడా తన కంపెనీలలో ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించకూడదని నిశ్చయించుకున్నారు. తాజాగా మరోసారి ఆయన గురించిన ఓ వార్త వైరల్గా మారింది.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) జూన్ 28న 115 మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 55 మంది ఫ్యాకల్టీతో పాటు 60 మంది బోధనేతర సిబ్బంది తొలగింపును నిలిపివేస్తున్నట్లు టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (TET) ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ఫైనాన్షియల్ గ్రాంట్లను పొడిగించేందుకు రతన్ టాటా అంగీకరించినట్లు సమాచారం.

'ఈ సమస్యను పరిష్కరించడంలో టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్తో చర్చలు కొనసాగాయి. ప్రాజెక్ట్, ప్రోగ్రామ్ ఫ్యాకల్టీ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ల వేతనాలకు సంబంధించి నిధులు విడుదల చేస్తామని TET హామీ ఇచ్చింది' అని TISS పేర్కొంది. సదరు సిబ్బంది తమ పనిని కొనసాగించాలని కోరింది. అయితే TET నుంచి గ్రాంట్ విడుదలైన తర్వాత వారి జీతాలు చెల్లించనుంది.
టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి గ్రాంట్ల కొరత కారణంగా TISS ఉద్యోగులను తొలగించింది . గత 6 నెలలుగా TET నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని, సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో కార్యకలాపాలను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపింది. TISSలో శాశ్వత అధ్యాపకులు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పేరోల్ క్రింద ఉన్నారు. గతంలో తొలగించబడిన ఉద్యోగులు ట్రస్ట్ ద్వారా నిధులు సమకూర్చబడిన ప్రాజెక్ట్ల క్రింద నిమగ్నమై ఉన్నారు.


Click it and Unblock the Notifications