బిగ్ బుల్ చివరిగా కొనుగోలు చేసిన స్టాక్ ఇదే.. 2 రోజుల్లో 50% పరుగులు.. మీ దగ్గర కూడా ఉందా..?
Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ ప్రఖ్యాత ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా మరణం తరువాత ఆయన స్టాక్స్ పనితీరు ఎలా ఉంటుందని అందరూ ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన గత ఆరు నెలలుగా చికిత్స పొందుతూ ఈ ఆదివారం కన్నుమూశారు. ఈ తరుణంలో ఆయన చివరిగా పెట్టుబడిగా పెట్టిన స్టాక్ తన పనితీరుతో అద్బుతాలను సృష్టిస్తోంది.
బిగ్ బుల్ మరణం తరువాత..
రాకేష్ జున్జున్వాలా అకాల మృతి పట్ల రాధాకిషన్ దమానీ సహా దేశీయ ఇన్వెస్టర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. దమానీ జున్జున్వాలాకు స్టాక్ మార్కెట్లో గురువు. అయితే.. రాకేష్ జున్జున్వాలా చివరి కంపెనీ షేర్లు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో అసాధారణ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది సింగర్ ఇండియాలో రేర్ ఎంటర్ప్రైజెస్లో పెట్టిన భారీ ఇన్వెస్ట్ మెంట్ గురించే.
సింగర్ ఇండియా
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో సింగర్ ఇండియా(SINGER India) షేర్లు బలమైన లాభాలను నమోదు చేశాయి. స్టాక్ ఏకంగా 20 శాతానికి పైగా పెరిగింది. ఈరోజు(బుధవారం) ట్రేడింగ్లో కూడా ఇదే విధమైన పెరుగుదల నమోదైంది. సింగర్ ఇండియా స్టాక్ కేవలం రెండు రోజుల్లో 50 శాతానికి పైగా లాభపడింది.
షేర్ ధర పెరుగుదల ఇలా...
బుధవారం నాటి ట్రేడింగ్లో సింగర్ ఇండియా షేరు అనూహ్య గరిష్ఠ స్థాయి అయిన రూ.82.95కి చేరుకుంది. రెండు రోజుల్లో 50 శాతానికి పైగా లాభపడింది. ఈ క్రమంలో సింగర్ ఇండియా షేర్లు బీఎస్ఈలో రూ.56.40 నుంచి రూ.82.95 స్థాయికి చేరుకుంది.
కంపెనీలో 10 శాతం వాటా..
రాకేష్ జున్జున్వాలాకు చెందిన రేర్ ఇన్వెస్ట్మెంట్స్ సింగర్ ఇండియాలో దాదాపు 42,50,000 షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీ మెుత్తం షేర్లలో వీటి వాటా దాదాపు 10 శాతం కంటే ఎక్కువ. జున్జున్వాలా మరణానికి ముందు కంపెనీని కొనుగోలు చేసినందున.. ఇది పెట్టుబడిదారుల దృష్టిని భారీగా ఆకర్షిస్తోంది. అప్పట్లో ఒక్కో షేర్ ను రూ.53.50 చొప్పున కొనుగోలు చేసినట్లు సమాచారం.
కంపెనీ వ్యాపారం..
సింగర్ ఇండియా కుట్టు మిషన్లు, కుట్టు సంబంధిత ఉపకరణాల తయారీ, వ్యాపారంలో నిమగ్నమై ఉంది. వీటికి తోడు కంపెనీ.. ఫ్యాన్లు, స్టవ్, AC, జ్యూస్ మిక్సర్ గ్రైండర్ మొదలైన ఇతర గృహోపకరణాల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది.