21 రోజుల్లో తేజాస్ ఎక్స్ప్రెస్ రైలు ఆదాయం రూ.3.70 కోట్లు, లాభం రూ.70 లక్షలు
న్యూఢిల్లీ: రైల్వేను అభివృద్ధి చేసి ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా ఇండియన్ రైల్వే హిస్టరీలో తొలిసారి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. లక్నో-ఢిల్లీ మధ్య ఈ రైలు ఇటీవల ప్రారంభమైంది. అక్టోబర్ నెలలో ఈ ప్రయివేటు రైలు లాభం రూ.70 లక్షలుగా నమోదయింది. టిక్కెట్లు అమ్మడం ద్వారా వచ్చిన మొత్తం రెవెన్యూ రూ.3.70 కోట్లు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ 50 రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని భావించింది.
విమాన టిక్కెట్ల ధరలో 50 శాతమే, వీఐపీలకు నో ఆఫర్స్, సౌకర్యాలు అదుర్స్
ఇందులో భాగంగా ప్రయివేటు ప్యాసింజర్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లక్నో - ఢిల్లీ ప్రయివేటు రైలు తొలుత ప్రారంభమైంది. తొలి ప్రయివేటు రైలు ఆదాయం నెలకు రూ.70 లక్షలుగా ఉంది. ఈ రైలు అక్టోబర్ 5వ తేదీన ఆపరేషన్లు ప్రారంభించింది. అప్పటి నుంచి సరాసరిన 80-85 శాతం ఆక్యుపెన్సీతో రన్ అయింది.
అక్టోబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు 21 రోజులు (ఈ రైలు వారానికి 6 రోజులు నడుస్తుంది) నడిచింది. ఇందుకు అయిన ఖర్చు రూ.3 కోట్లు. రోజుకు సగటున రూ.14 లక్షలు ఖర్చు చేసింది. అదే సమయంలో రోజుకు ప్రయాణీకుల నుంచి టిక్కెట్ రూపంలో రూ.17.50 లక్షలు వచ్చింది.