ఆంధ్రప్రదేశ్ ఆ సంక్షోభం గుర్తుందిగా..: లోన్ మారటోరియంపై రఘురాం రాజన్ హెచ్చరిక
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి ప్రజల చేతుల్లో డబ్బులు లేని పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) లోన్ మారటోరియం ఊరటను కల్పించిన విషయం తెలిసిందే. తొలుత మార్చి నుండి మూడు నెలలు వెసులుబాటు కల్పించినప్పటికీ.. లాక్ డౌన్ దాదాపు మూడు నెలల పాటు ఉండటం, వ్యవస్థలు తిరిగి కోలుకోవడానికి కాస్త సమయం పడుతున్న నేపథ్యంలో మరో మూడు నెలలు పొడిగించి ఆగస్ట్ వరకు గడువు ఇచ్చింది. దీనిని డిసెంబర్ చివరినాటికి, వచ్చే ఏడాది జూలై నాటికి పొడిగించాలనే వాదనలు ఉన్నాయి. ఈ వాదనలతో ఎస్పీఐ చైర్మన్, హెచ్డీఎఫ్సీ చైర్మన్ విబేధించారు. ఆగస్ట్ తర్వాత లోన్ మారటోరియం అవసరం లేదన్నారు.

మారటోరియం.. ఏపీ మైక్రోఫైనాన్స్ క్రైసిస్
ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురాం రాజన్ కూడా లోన్ మారటోరియంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇండియా పోడోకాస్ట్ వ్యవస్థాపకులు అంకు గోయల్తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. లోన్ మారటోరియం పొడిగింపు అవసరం లేదన్నారు. దీనికి బ్యాంకులు ముగింపు పలకాలని సూచించారు. అంతేకాదు, తన వ్యాఖ్యల్లోని హేతుబద్దతను సరైనదేనని చెప్పేందుకు రాజన్.. ఆంధ్రప్రదేశ్ మైక్రోఫైనాన్స్ సంక్షోభాన్ని గుర్తు చేశారు. లోన్ మారటోరియం గురించి ప్రశ్నించగా.. ఆంధ్రప్రదేశ్లో మైక్రోఫైనాన్స్ క్రైసిస్ గుర్తున్నాయిగా.. అని రాజన్ అన్నారు.

ఓసారి డబ్బులు చెల్లించవద్దని చెప్పాక... అలవాటు కష్టం
డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని మీరు ప్రజలకు చెప్పిన తర్వాత, వారు డబ్బులు ఆదా చేయలేరని, దీంతో తిరిగి లోన్ చెల్లింపులు జరిపే అలవాటును తీసుకురావడం కష్టమవుతుందని రాజన్ చెప్పారు. ఎందుకంటే వారి వద్ద అప్పుడు డబ్బులు ఉండవని వెల్లడించారు. ఏపీలో మైక్రోఫైనాన్స్ సంక్షోభానికి ఇదే కారణమని అభిప్రాయపడ్డారు. దీంతో సూక్ష్మ ఆర్థిక సంస్థలు బలహీనపడతాయన్నారు. ఎక్కువకాలం మారటోరియం విధిస్తే ఆ మొత్తాలను వసూలు చేసుకోవడం బ్యాంకులకు ఇబ్బంది అవుతుందని చెప్పారు.

ఆర్బీఐ సూపర్..
ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల సమయంలో ఆర్బీఐ పాత్రపై ప్రశంసలు కురిపించారు రాజన్. రూపాయి మరీ పడిపోలేదని, ఆర్బీఐకి థ్యాంక్స్ అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, మన వృద్ధి రేటుపై భయాలు కొనసాగుతున్నప్పటికీ రూపాయి క్షీణించలేదన్నారు.
ప్రయివేటు బ్యాంకుల కంటే ప్రభుత్వరంగ బ్యాంకులు రైటాఫ్ చేస్తున్న రుణాలపై ఆందోళన చెందుతున్నాయని, ఎందుకంటే వివిధ రకాల విచారణలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.

కరోనా వినియోగ అలవాట్లు మార్చేసింది
డబ్బు ముద్రణకు సంబంధించి మాట్లాడుతూ.. ఇది అన్ని సందర్భాల్లో ముద్రణ కుదరదని రాజన్ చెప్పారు. కరోనా ప్రజల వినియోగ అలవాట్లని మార్చుతోందని అన్నారు. ప్రజలను మరింత పొదుపరులుగా మార్చివేస్తోందన్నారు. దూరవిద్యను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చునన్నారు. ఉద్యోగాల సృష్టికి మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలన్నారు.


Click it and Unblock the Notifications