PwC: దాదాపు 74 శాతం మంది భారతీయులు వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నట్లు PwC గ్లోబల్ కన్స్యూమర్ ఇన్సైట్స్ పల్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 శాతంతో పోలిస్తే ఇండియాలో ఈ రేటు ఎక్కువగా ఉండటం కొంత కలవరపెట్టే అంశమని పేర్కొంది. అయితే పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి 63 శాతం మంది భారతీయ వినియోగదారులు అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటున్నట్లు గమనించినట్లు చెప్పింది.
జూన్ 2022లోనూ PwC సంస్థ ఇదే తరహా సర్వే నిర్వహించింది. అప్పటితో పోలిస్తే సర్వే చేయబడిన అన్ని వర్గాల ప్రజల్లో.. ప్రణాళికాబద్ధమైన వ్యయం గణనీయంగా తగ్గినట్లు గుర్తించామని తెలిపింది. భౌతిక, డిజిటల్ ఛానల్స్ ద్వారా ప్రపంచ స్థాయి ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం డిమాండ్ పెరుగుతూనే ఉన్నట్లు పేర్కొంది.

'బ్రాండెడ్ వస్తువుల కోసం చేసే ఖర్చులను తగ్గించుకుంటూ, స్థానిక తయారీ వైపు ఇండియన్ కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. రాబోయే కాలంలో ప్రయాణాల కోసం ఎక్కువగా వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు. వచ్చే 6 నెలల్లో లగ్జరీ, ప్రీమియం ఉత్పత్తులు, ఫ్యాషన్ సహా పలు రంగాల్లో దేశీయ వినియోగదారుల వ్యయం భారీగా తగ్గుతుంది' అని PwC ఇండియా రిటైల్ & కన్స్యూమర్ లీడర్ రవి కపూర్ తెలిపారు.
ఉచిత లేదా డిస్కౌంట్ తో కూడిన డెలివరీ అందించే రిటైలర్ల వద్ద కొనుగోలు చేయడానికి 47 శాతం మంది భారతీయ వినియోగదారులు ఇష్టపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. షాపింగ్ చేసేటప్పుడు తరచుగా ధరల పెరుగుదల సమస్యను అనుభవిస్తున్నట్లు 50 శాతం మంది చెప్పారు. పెద్ద క్యూలు, ఉత్పత్తి లభ్యత సైతం కన్స్యూమర్ ల ప్రవర్తనను ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించింది.
ప్రణాళికాబద్ధంగా ఖర్చులు తగ్గించుకుంటూ, ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ.. క్వాలిటీ ఉత్పత్తుల కోసం అధిక మొత్తంలో చెల్లించడానికీ సిద్ధంగా ఉన్నట్లు భారతీయ వినియోగదారులు చెప్పారని నివేదిక తెలిపింది. తిరిగి వినియోగించగలిగిన వస్తువులు, పర్యావరణ హిత పదార్థాలతో తయారుకాబడిన, నైతికంగా మంచి పేరున్న కంపెనీ ఉత్పత్తులతో పాటు స్థానిక తయారీ కోసం ఎక్కువగా వెచ్చించడానికి వెనకాడబోమన్నారు.


Click it and Unblock the Notifications