వడ్డీ రేట్లు తగ్గించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు
కోరనా మహమ్మారి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 75 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఈ ప్రయోజనాలను బ్యాంకులు తమ కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా అదే బాట పట్టింది.
ఆర్బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేటును తగ్గించిందని, ఈ నేపథ్యంలో తాము వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. అన్ని కాలపరిమితులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయని తెలిపింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా మొర ఆలకించండి: సీతారామన్కు మాల్యా, లాక్డౌన్పై ఏమన్నాడంటే
బ్యాంకు తన బేస్ రేటును కూడా 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.05 శాతం నుండి 8.90 శాతానికి తగ్గించిందని తెలిపింది. బ్యాంకు వివిధ మెచ్యూరిటీ టర్మ్ డిపాజిట్ రేట్లను కూడా తగ్గించింది. ఏడాది అంతకుమించి కాలపరిమితి డిపాజిట్పై 5.80 శాతానికి తగ్గించింది.
ఆర్బీఐ తగ్గింపు నేపథ్యంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించింది. అలాగే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వ్యక్తిగత, రిటైల్ రుణాలపై వడ్డీ రేటు 0.75 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉండే యూబీఐ రుణాలపై వడ్డీ రేటు 7.95 శాతం నుంచి 7.20 శాతానికి తగ్గుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీ రేటు 8 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గుతుంది.