ఆంధ్రప్రదేశ్లా.. మావద్ద అలాంటి నిబంధనల్లేవు!: KIAకు పంజాబ్ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్లోని కియా మోటార్స్ ప్లాంట్ను తమిళనాడుకు తరలిస్తారనే ప్రచారం కేవలం ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లోనే వేడిని రాజేసింది. కియా ప్లాంట్ అనంతపురం నుండి తరలి వెళ్లడం లేదని ఇటు ఏపీ ప్రభుత్వం, తమకు అలాంటి ఆలోచన లేదని కియా ప్రతినిధులు స్పష్టం చేశారు. తాము కియాతో చర్చలు జరపడం లేదని కూడా తమిళనాడు అధికారులు వెల్లడించారు.
ఏపీ నుండి తమిళనాడుకు ప్లాంట్ తరలింపు నిజమా? కియా మోటార్స్ ఏం చెబుతోంది?
స్థానికులకు ఉద్యోగం
కియా తరలింపు ప్రచారం నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. కియా సంస్థకు అక్కడి ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇబ్బందులు తమ రాష్ట్రంలో ఉండవని పరోక్షంగా వెల్లడించింది. ఏపీలో పరిశ్రమలో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. వివిధ కారణాలతో పాటు స్థానికులకు ఉద్యోగాలు అనే అంశం కూడా కియాకు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు.
|
మా రాష్ట్రానికి రండి.. పంజాబ్ పిలుపు
ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కియాకు ఆహ్వానం పలుకుతూ.. తమ రాష్ట్రంలో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే పరిమితులు లేవని స్పష్టం చేసింది. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్ళే ఆలోచనలో ఉందని రాయిటర్స్ కథనాన్ని ఉటంకిస్తూ ఓ ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన కథనాన్ని ట్యాగ్ చేస్తూ invest in punjab ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ చేసింది. తమ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని, పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది.
కలకలం రేపిన కథనం
ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోవచ్చుననే కథనం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కియా తరలి వెళ్తుందనే ప్రచారం కలకలం రేపింది. కొత్త ప్రభుత్వం హయాంలో పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. లోకసభలో కూడా టీడీపీ మండిపడింది. ఈ నపేథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కియా ఖండించాయి. సౌత్ కొరియాకు చెందిన 1.1 బిలియన్ డాలర్ల ఈ పరిశమ్ర రెండేళ్ల క్రితం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది.
అప్రమత్తమైన ప్రభుత్వం
వైసీపీ నేతల బెదిరింపుల వల్లే కియా వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని, అంతర్జాతీయ సంస్థలతో వ్యవహరించే తీరు ఇదేనా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు తరలిపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని జనసేనాని ప్రశ్నించారు. ఈ సమయంలో తమ రాష్ట్రానికి రావాలని పంజాబ్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా కలకలం రేగడంతో మంత్రులు బుగ్గన, గౌతమ్ రెడ్డి, శంకర నారాయణ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవలు వేర్వేరుగా ఈ కథనాలను ఖండించారు.
రాయిటర్స్ ఏం చెప్పిందంటే..
కియా ఇటీవల మార్కెట్లోకి తీసుకు వచ్చిన తొలి మోడల్ సెల్టాస్ SUV విజయవంతమైందని, రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం చెప్పడంతో నిపుణులైన సిబ్బంది దొరకడం కష్టతరంగా మారిందని, ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాలని కూడా ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోందని, ఇది కియాకు ఇబ్బందికరంగా మారినట్లుగా ఉందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
కియాకు సమస్యలు అంటూ..
కియా ఏపీలో సమస్యలు ఎదుర్కొంటోందని, తమ రాష్ట్రంతో ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని, వచ్చే వారం కార్యదర్శుల స్థాయి సమావేశం ఉందని, దాని తర్వాత మరింత స్పష్టత వస్తుందని తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారని కూడా రాయిటర్స్ పేర్కొంది.
ఒప్పందాల సమీక్ష..
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించిందని, వాటిలో పీపీఏలు కూడా ఉన్నాయని, దీని వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్కు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఉన్నా వెనక్కి వెళ్తున్నారని 2019 ఆగస్ట్ 7న జపాన్ రాయబారి రాసిన లేఖలో ప్రస్తావించారని రాయిటర్స్ పేర్కొంది.
కియా ఉంటే...
రూ.13,500 కోట్ల పెట్టుబడితో కియా పరిశ్రమను ఏర్పాటు చేశారు. 13 వేల నుంచి 18 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రతి సంవత్సరం 3 లక్షల కార్ల ఉత్పత్తి చేసే దిశగా ముందుకు సాగుతోంది. వాస్తవానికి కియా ప్రతినిధులు తమ ప్లాంటుకు తమిళనాడును తమ మొదటి ప్రాధాన్యంగా చూశారు. అక్కడ కాకుంటే గుజరాత్లో ఏర్పాటు చేయాలని భావించారు. నాటి ప్రభుత్వం కియాను ఏపీకి తీసుకు వచ్చింది. కియా ఉంటే దిగ్గజ కంపెనీలను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని భావించారు.