Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. తెల్లవారుజాము వరకు పబ్లు, బార్లు, రెస్టారెంట్లు ఓపెన్..!
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో ఫీఫా ప్రపంచ కప్ సందడి నెలకొన్న నేపథ్యంలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరిగే రోజుల్లో పబ్లు, బార్లు, రెస్టారెంట్లను తెల్లవారుజామున 3.30 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. మంగళవారం, బుధవారం, ఆదివారం, ఈ మూడు రోజులు పాటు తెల్లవారుజాము 3 గంటల 30 నిమిషాల వరకు పబ్లు, బార్లు, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. సాధారణంగా ఇక్కడ రాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఉంది.
న్యూఢిల్లీకి చెందిన నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మూడు ఫీఫా ప్రపంచ కప్ మ్యాచ్ల సమయంలో ఆహార సేవలను కనీసం తెల్లవారుజామున 3 గంటల వరకు పొడిగించాలని కోరుతూ సోమవారం సింగ్కు ఒక విజ్ఞప్తిని చేసింది. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని... సేమీ ఫైనల్, ఫైనల్ జరిగే రోజుల్లో ఆహార సేవల వేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది బెంగళూరు నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే అన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కూడా స్పందించారు. ఫుట్బాల్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఒక వేడుక అని అని ఎక్స్ లో పేర్కొన్నారు. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు, మ్యాచ్లు జరిగే రోజుల్లో బెంగళూరులోని హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట నుంచి 3.30 గంటల వరకు ఆహార సేవలను పొడిగించుకోవడానికి తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతలు, పౌరుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని శివకుమార్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మ్యాచ్లను ఆస్వాదించాలని కోరారు. అలాగే అధికారులకు పూర్తి సహకారం అందించాలన్నారు. అయితే ఈ వార్త పై రెస్టారెంట్లు, బబ్ ల యాజమాన్యాలు స్పందించాయి. పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు తమకు అందలేదన్నాయి. ప్రస్తుతానికి తాము ప్రపంచ కప్ మ్యాచ్లను ప్రదర్శించే ప్రణాళికలో లేమని పేర్కొన్నాయి.
పబ్లు, బార్లు రాత్రి 3:30 గంటల వరకు తెరిచి ఉండటానికి నోటీసులు అనుమతిస్తున్నప్పటికీ, అంతవరకు మద్యం అందించడానికి అనుమతి ఉందో లేదో అందులో పేర్కొనలేదని తెలిపాయి. ఒకవేళ రాత్రి 3:30 గంటల వరకు మద్యం అందించడానికి అనుమతి లేకపోతే, మేము మ్యాచ్లను ప్రదర్శించమని డాల్ఫిన్స్ బార్ అండ్ కిచెన్ భాగస్వామి అమిత్ దేవ్ తెలిపారు.


Click it and Unblock the Notifications