Reliance news: దేశంలో అపర కుబేరుడిగా వెలుగొందుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. తన వారసులను వ్యాపార రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన కంపెనీ AGMలో కూడా ప్రకటన చేశారు. అయితే అనూహ్యంగా కొత్త చిక్కు వచ్చి పడింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) బోర్డులో అనంత్ అంబానీ నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రాక్సీ సలహా సంస్థ IiAS సిఫార్సు చేసింది. ఆయన వయస్సు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే మరో ఇద్దరు వారసులు ఆకాష్ మరియు ఇషాల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

'28 ఏళ్ల వయస్సులో నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్గా అతని నియామకం మా ఓటింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదు' అని IiAS తన సిఫార్సు నోట్లో పేర్కొంది. డైరెక్టర్కు 10 సంవత్సరాల కంటే తక్కువ పని అనుభవం లేదా 30 ఏళ్లకు మించి వయస్సు లేని పక్షంలో వారిని పక్కన పెట్టాల్సిందిగా IiAS సూచిస్తుంది. డైరెక్టర్ మొదటి తరం ప్రమోటర్ లేదా వ్యవస్థాపకులు అయితే మాత్రం ఈ నియమానికి మినహాయింపు ఇస్తుంది.
డిసెంబరు 31 లోపు ఈ నియామకాలు అమలులోకి రావచ్చని RIL స్పష్టం చేసినట్లు IIAS తెలిపింది. కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఇషా, ఆకాష్ మరియు అనంత్ల నియామకాల కోసం రిమోట్ ఇ-ఓటింగ్ ద్వారా సభ్యుల ఆమోదం పొందేందుకు రిలయన్స్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ నోటీసు గురించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు RIL సెప్టెంబరులోనే తెలియజేసింది. కాగా ఈ-ఓటింగ్ ప్రక్రియ అక్టోబర్ 26తో ముగియనుంది.
బోర్డులో అనంత్ నియామకానికి మరికొన్ని ప్రాక్సీ సలహా సంస్థలు అనుకూలత వ్యక్తం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు మూడు నియామకాలకు అనుకూలంగా ఓటు వేయాలని ఇంగోవర్న్ సిఫార్సు చేసింది. 'RIL బోర్డు ఒక వారసత్వ ప్రణాళిక ఉండేలా స్పృహతో కూడిన చర్యలు తీసుకుంది' అని ప్రాక్సీ సంస్థ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ సుబ్రమణియన్ తెలిపారు.


Click it and Unblock the Notifications