D Mart: ఒక్క స్టోర్ నుంచి 415 స్టోర్ల వరకు.. ఇదీ రాధా కిషన్ ధమానీ జైత్ర యాత్ర..!
వదినమ్మ సరుకులు నిండుకున్నాయి డీ మార్ట్ కు వెళ్లి తీసుకోవాలి. డీ మార్ట్ లో తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయట కదా వెళ్దామా అని మరో మహిళా. ఇలా డీ మార్ట్ గురించి మాట్లాడుకుంటారు. దేశంలో డీ మార్ట్ లు అంత ఫేమస్ అయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా నగరాల్లో డీమార్ట్ స్టోర్లు ఉన్నాయి. డీ మార్ట్ స్టోర్లు ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి కంపెనీ యజమాని రాధా కిషన్ దమానీ ఎంచుకున్న మార్గమే. ఆయన సైలెంట్ గా దేశంలో డీ మార్ట్ స్టోర్లను విస్తరిస్తున్నారు. డీ మార్ట్ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా దమానీ వేల కోట్ల సంపదను సృష్టించారు. కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10 రాష్ట్రాలలో 415 స్టోర్లను నిర్వహిస్తూ, రూ.57,790 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఈ ఆదాయం అషామాషీగా వచ్చింది కాదు. దీని వెనక స్పష్టమైన వ్యాపార వ్యూహం, దీర్ఘకాలిక దృష్టి ఉంది. రాధా కిషన్ దమానీ మొదట్లో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారు. ఆ తర్వాత ఆయన రిటైల్ రంగంపై దృష్టి సారించారు. డీ మార్ట్ తో చరిత్ర సృష్టించారు. డీ మార్ట్ మొట్టమొదటి ఔట్ లేట్ ను 2002 ముంబైలోని పోవాయిలో ప్రారంభించారు. ఆయన మొదటగా స్టోర్లను విస్తరిద్దామని అనుకోలేదు. మొదటి ఔట్ లేట్ బాగా నడవడంతో విస్తరణపై దృష్టి పెట్టారు. 2002లో ఒక్క స్టోర్ మొదలైన ప్రయాణం 2024-25కు 415 స్టోర్లకు చేరింది.

రాధా కిషన్ దమానీ మొదటి సూత్రం తక్కువ ఖర్చుతో స్టోర్లు ఏర్పాటు చేయడం. అందుకే ఏ డిమార్ట్ స్టోర్లోకి అడుగుపెట్టినా మెరిసే మార్బుల్ ఫ్లోర్లు ఉండవు, ఫ్యాన్సీ డిజైనర్ ఫిక్చర్లు ఉండవు, లైటింగ్ చాలా సాదాసీదాగా ఉంటుంది. ఫ్యూచర్ గ్రూప్కు చెందిన బిగ్ బజార్ వంటి ప్రత్యర్థులు ఖరీదైన మాల్స్లో దీర్ఘకాలిక లీజులను ఎంచుకోగా, దమానీ భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. డిమార్ట్ తన స్టోర్లను చాలా వరకు సొంత భవనాల్లోనే ఏర్పాటు చేశారు. ఇందుకు భారీగా పెట్టుబడి అవసరం. కానీ ఈ రోజుల్లో భారీగా పెరిగిన అద్దె ఖర్చులు పెట్టుబడి కంటే ఎక్కువ ఉంటున్నాయి.
ఆయన విజయాల్లో మరో సూత్రం క్రెడిట్ సైకిల్. దేశంలోని ఎఫ్ఎంసీజీ రంగంలో సాధారణ క్రెడిట్ సైకిల్ 21 నుంచి 30 రోజులు ఉంది. కానీ డీ మార్ట్ మాత్రం 11 రోజుల్లోనే పేమెంట్ చేస్తోంది. ఇది కూడా ఆ కంపెనీకి కలిసొచ్చింది. మిగతా వారి కంటే కాస్త తక్కువ ధరకే డీ మార్ట్ సరుకులు వచ్చేవి. దీంతో కస్టమర్లకు కూడా తక్కువ ధరకే వస్తువులను విక్రయిస్తోంది. నిత్యావసర వస్తువులపై డిమార్ట్ ధరలు పోటీ దుకాణాల కంటే 20 నుండి 25% తక్కువగా ఉన్నాయని ఓ నివేదిక పేర్కొంది.
2002లో డీ మార్ట్ మొదటి స్టోర్ ను ప్రారంభిస్తే దాని రెండో స్టోర్ ప్రారంభించేందుకు చాలా సమయం పట్టింది. కంపెనీ మొదటి 10 స్టోర్లు ప్రారంభించడానికి 8 సంవత్సరాలు తీసుకుంది. కానీ ఆ తర్వాత వేగంగా కొత్త స్టోర్లను ప్రారంభిస్తూ వస్తోంది. మొదట మహారాష్ట్ర, ఆ తర్వాత గుజరాత్, ఆపై ఇతర రాష్ట్రాల్లో డీ మార్ట్ స్టోర్లను విస్తరించారు.
డిమార్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం లాభదాయకంగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15.8% పెరిగి రూ67,096 కోట్లకు చేరగా, నికర లాభం 10.1% వృద్ధితో ₹3,224 కోట్లుగా నమోదైంది. ఎవెన్యూ సూపర్ మార్ట్ 2017 మార్చిలో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. అక్కడి నుంచి ఈ స్టాక్ ధర పెరుగుతూ వస్తోంది.


Click it and Unblock the Notifications