బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్కు క్రెడిట్ కార్డ్తో కుచ్చుటోపీ: రూ.లక్షలు దోపిడీ
ముంబై: బోనీ కపూర్.. సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. భారీ చిత్రాల నిర్మాత. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ తండ్రి. కోట్ల రూపాయల మేర లావాదేవీలను హ్యాండిల్ చేసే ఈ బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్.. ఆర్థిక నేరగాళ్ల పాలిట పడ్డారు. బ్యాంకింగ్ మోసానికి గురయ్యారు. లక్షల రూపాయల మేర నష్ట పోయారు. తాను మోసపోయినట్టు గుర్తించిన బోనీ కపూర్.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ మోసం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
2021-2022 ఆర్థిక సంవత్సరంలో 60,414 కోట్ల రూపాయల మేర బ్యాంకింగ్ మోసాలు చోటు చేసుకున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారమే వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై తన వార్షిక నివేదికలో పూర్తి వివరాలను పొందుపరిచింది. లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తానికే ఖాతాదారులు మోసపోయారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. లక్ష రూపాయల కంటే తక్కువ మొత్తానికి మోసాలు జరగలేదని తెలిపింది.
అత్యధికంగా ప్రైవేట్ బ్యాంకుల ద్వారానే ఇవి సంభవించాయి. ప్రైవేటు బ్యాంకుల్లో మోసాల సంఖ్య అధికంగా ఉండగా.. జాతీయ బ్యాంకుల్లో మోసపోయిన అమౌంట్ అధికంగా రికార్డయింది. ప్రైవేటు బ్యాంకుల్లో లక్ష నుంచి రెండు లక్షల రూపాయల లోపు కార్డులు/ఇంటర్నెట్ మోసాలు అధికంగా చోటు చేసుకున్నాయి. ఆర్బీఐ తన వార్షిక నివేదికను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే బోనీ కపూర్ అవే బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ మోసానికి గురి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బోనీ కపూర్ క్రెడిట్ కార్డ్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు 3.82 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన అయిదుసార్లు వాళ్లు ఈ కార్డ్ ద్వారా ఈ మొత్తాన్ని దుర్వినియోగం చేశారు. ఈ విషయం బోనీ కపూర్కు తెలియదు. మార్చి 30వ తేదీన సంబంధింత క్రెడిట్ కార్డును జారీ చేసిన బ్యాంక్ సిబ్బంది ఆయనకు ఫోన్ చేశారు. ఈ మొత్తాన్ని క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తన ప్రమేయం లేకుండా ఈ లావాదేవీలు జరిగినట్లు తేలడంతో బోనీ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోనీ కపూర్ తరఫున ఆయన వ్యక్తిగత సహాయకుడు ముంబై అంబోలీ పోలీస్ స్టేషన్లో కంప్లైట్ చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్ను వినియోగించి ఆర్థిక నేరగాళ్లు ఈ మోసం చేసినట్లు అంబోలి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.