Economic Survey: పెరిగిన భారత ఎగుమతులు.. బొమ్మల నుంచి ఆయుధాల వరకు: ద్రౌపదీ ముర్ము
Economic Survey: కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్కరోజు ముందు ప్రభుత్వం సాధించిన విషయాలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం చాలా కీలకంగా మారింది. గత బడ్జెట్ కాలంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన అనేక విజయాలను, తెచ్చిన మార్పులను ఆమె తన ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు వెల్లడించారు.
తయారీకి కేంద్రంగా..
గడచిన ఏడాదిలో భారత తయారీ రంగం అనేక అవకాశాలను అందిపుచ్చుకుంది. ప్రపంచ దేశాలకు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు భారత్ తయారీ కేంద్రంగా మారిందని ముర్ము వెల్లడించారు. ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. విమానాల నుంచి సెమీకండక్టర్ల తయారీ వరకు కీలక రంగాల్లోకి భారత్ అడుగుపెట్టింది. ఇకే క్రమంలో డిఫెన్స్ ఉత్పత్తుల ఎగుమతులు గతంలో కంటే 6 రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. అలాగే ఆటబొమ్మల దిగుమతులు 70 శాతం తగ్గటంతో పాటు స్వదేశీ ఎగుమతులు 60 శాతం మేర పెరగటం విశేషం.
పీఎం గతిశక్తి..
దేశంలో రవాణా, లాజిస్టిక్స్ బలపరిచేందుకు పీఎం గతిశక్తి పేరుతో మెగా ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే 2024 నుంచి దీనిపై కేంద్రం దృష్టి మరింతగా పెరగనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దేశంలో వ్యాపారవృద్ధికి అవసరమైన లాజిస్టిక్స్ కనెక్టివిటీని పెంచి వస్తువుల రవాణా ఖర్చులను తగ్గించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం అనేక భారీ ఇన్ ఫ్రా ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా పట్టాలెక్కించినట్లు ముర్ము వెల్లడించారు.
గ్రామీణ వ్యాపారాలు..
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటీర పరిశ్రమలు ఆర్థికానికి చాలా బలంగా నిలుస్తున్నాయి. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల వ్యాపార టర్నోవర్ రూ.లక్ష కోట్లకు చేరుకున్నట్లు ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో వెల్లడించారు. భారత ప్రభుత్వం ఇన్వెవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోందని, దీనివల్ల స్టార్టప్ ఎకోసిస్టంలో 90 వేల వ్యాపారాలకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఇలాంటి అనేక చర్యల వల్ల గ్లోబల్ ఇన్వోవేషన్ ఇండెక్స్ లో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నట్లు రాష్ట్రపతి తన ప్రసంగం ద్వారా వెల్లడించారు.
గ్రీన్ ఎనర్జీపై దృష్టి..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశీలు శిలాజ ఇంధనాల నుంచి గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం సైతం దీనిపై దృష్టి సారించినట్లు రాష్ట్రపతి వెల్లడించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 20 శాతం పెరిగింది. దీనికి తోడు చమురు దిగుమతుల వ్యయాన్ని తగ్గించటంలో భాగంగా పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండింగ్ ను 20 శాతానికి తీసుకెళ్లే దశలో భారత ప్రభుత్వం ఉంది. ఇదే విధంగా భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ హైడ్రోజన్ పై కూడా ఫోకస్ పెంచింది.