India Post Payments Bank: భారతదేశంలో అనేక ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు పోస్టాఫీసులు ప్రత్యేకమైనవి. ప్రస్తుతం ఈ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. కోట్ల మంది వీటి సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులను స్కామర్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయని వ్యక్తులకు సంబంధించిన పోస్టల్ బ్యాంక్ ఖాతాలను సంస్థ బ్లాక్ చేస్తోందని వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వెంటనే ప్రక్రియను సులువుగా పూర్తి చేసుకోవటానికి కేవైసీ అప్డేషన్ లింక్ పేరుతో సామాన్యులకు వల వేస్తున్నారు.

నేరగాళ్లు పంపిస్తున్న లింక్ లోని సమాచారాన్ని పరిశీలిస్తే ప్రియమైన కస్టమర్లారా మీరు ఖాతాలోని పాన్ కార్డ్ వివాలను వెంటనే అప్ డేట్ చేయకపోతే ఈరోజు నుంచి పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు సీజ్ అవుతాయని చెప్పబడింది. అలా జరగకుండా ఉండాలనే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయాలని వారు అందులో సూచిస్తున్నారు. దీనిపై పీఐబీ తాజాగా క్లారిటీ ఇస్తూ మెసేజ్ విడుదల చేసింది. బయట సర్కులేట్ అవుతున్న ఈ మెసేజ్ పూర్తిగా ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ధృవీకరించింది. ఇండియాపోస్ట్ ఆఫీస్ ఎప్పుడూ అలాంటి సందేశాలను పంపదని క్లారిఫై చేసింది.
ఖాతాదారులు తమ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మెసేజ్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసిన వెంటనే.. స్కామర్లు వ్యక్తిగత వివరాలను యాక్సెస్ చేయటంతో పాటు డేటాను దొంగిలించే ప్రమాదం ఉంది. ఇది వ్యక్తుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే తరహాలో సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలను వివిధ కొత్త మార్గాల్లో టార్గెట్ చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇలాంటి మెసేజ్ అందుకున్నప్పుడు ముందుగా సమీపంలోని పోస్టాఫీసు కార్యాలయానికి వెళ్లటం ఉత్తమం అని వారు చెబుతున్నారు.
పెరిగిపోతున్న ఫిషింగ్ స్కామ్స్..
సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మోసగాళ్లు నిరంతరం కొత్త పద్ధతులతో ప్రజల డేటాను చౌర్యం చేసి ఈజీ మనీ సంపాదించాలని చూస్తున్నారు. ఇందుకోసం వారు ఎక్కువగా వాడే పద్ధతినే ఫిషింగ్ అని అంటారు. ఈ పద్ధతి కింద వారు వ్యక్తుల ఈమెయిల్స్, ఎస్ఎమ్ఎస్ లు, ఫోన్ కాల్స్ వంటి వాటిని మార్గాలుగా వాడుతుంటారు. వీటి ద్వారా స్కామర్లు పంపే లింక్స్ ఎట్టిపరిస్థితుల్లోనూ యాక్సెస్ చేయరాదని, అది వారి వ్యక్తిగత డివైజ్ భద్రతను కాంప్రమైజ్ చేసి డేటా చౌర్యానికి దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పైగా బ్యాంకులు ఖాతాదారులను ఇలాంటి వివరాలు లింక్స్ ద్వారా అప్డేట్ చేయమని కోరవని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications