రిలయన్స్ పునర్వ్యవస్థీకరణ.. ప్రత్యేక కంపెనీగా O2C
భారత ప్రయివేటురంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార పునర్వ్యవస్థకరణ చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చమురు, రసాయన (O2C) విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీస్తోంది. అనంతరం సౌదీ ఆరామ్కో వంటి వ్యూహాత్మక విదేశీ ఇన్వెస్టర్కు వాటాలు విక్రయించనుంది. తద్వారా వాటాదారులకు మరింత వ్యాల్యూ చేకూర్చనుంది. O2C బిజినెస్కు మాతృసంస్థ నుండి దాదాపు రూ.1.81 లక్షల కోట్ల రుణం లభిస్తుంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ చేపట్టడం ద్వారా O2C వ్యాల్యూ చైన్లో లభించనున్న అవకాశాలపై దృష్టి పెట్టేందుకు వీలు చిక్కనున్నట్లు రిలయన్స్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.
మూలధనం సమకూర్చుకోవడం ద్వారా సామర్థ్య పెంపు
సొంతంగా మూలధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉందని రిలయన్స్ వివరించింది. కంపెనీ కోసం ప్రత్యేకించి యాజమాన్య టీమ్, ఇన్వెస్టర్ల నుండి పెట్టుబడులను ఆకర్షించడం వంటి వాటితో పటిష్టతను సంతరించుకోనుంది. రిలయన్స్కు చెందిన చమురు రిఫైనరీ, పెట్రో కెమికల్ ఆస్తులు, రిటైల్ ఇంధన బిజినెస్లతో O2C ఏర్పాటవుతుంది.
అదే సమయంలో ఆయిల్, గ్యాస్ను ఉత్పత్తి చేసే కేజీ D6 క్షేత్రాలు, టెక్స్టైల్ బిజినెస్లు O2Cలో భాగస్వామ్యం కాబోవని తెలిపింది. రిలయన్స్ కేజీ-డీ6తో కూడిన చమురు, గ్యాస్ వెలికితీత ఉత్పత్తి బిజినెస్లతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రెజరీ, టెక్స్టైల్ బిజినెస్లను కలిగి ఉంటుంది. గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా నిలుస్తుంది.
రిలయన్స్ వాటా
రిలయన్స్ గ్రూప్లోని రిటైల్ బిజినెస్ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్, టెలికం, డిజిటల్ వెంచర్స్ను జియో ప్లాట్ఫామ్స్ కలిగి ఉంటుంది. రిలయన్స్ రిటైల్లో 85.1%, వాటా జియో ప్లాట్ఫామ్స్లో 67.3% చొప్పున రిలయన్స్కు వాటా ఉంది. మిగతా వాటాలు ఫేస్బుక్, గూగుల్ వంటి సంస్థలకు ఉన్నాయి. రిలయన్స్ వ్యాపార పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆరామ్కోతో చర్చలు మరింత ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రత్యేక కంపెనీగా..
ప్రత్యేక కంపెనీగా ఆవిర్భవించనున్న O2C ఆయిల్ రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ ప్లాంట్స్, తయారీ యూనిట్లతో పాటు బ్రిటిష్ పెట్రోలియంతో ఏర్పాటు చేసిన ఆయిల్ రిటైల్ మార్కెటింగ్ జేవీలో రిలయన్స్కు గల 51 శాతం వాటా బదలీ కానుంది. సింగపూర్, యూకేలలోని అనుబంధ ఆయిల్ ట్రేడింగ్ కంపెనీలు, ఉరుగ్వే పెట్రో మార్కెటింగ్ కంపెనీని సొంతం చేసుకోనుంది. గుజరాత్-మహారాష్ట్ర రిలయన్స్ ఇథేన్ పైప్ లైన్, సిబూర్ జేవీలో రిలయన్స్కు ఉన్న దాదాపు 75% వాటాను పొందనుంది.