Positron Energy IPO: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నప్పటికీ ఐపీవోలు మాత్రం తమ పని తాము చేసుకుపోతూనే ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీ మార్కెట్లలో బెట్టింగ్ కంటే ఐపీవోల్లో బెట్టింగ్ మంచి రాబడులను తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పొజిట్రాన్ ఎనర్జీ ఐపీవో గురించే. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో నేడు కంపెనీ షేర్లు బలమైన లిస్టింగ్ నమోదు చేశాయి. ఈ క్రమంలో 90 శాతం ప్రీమియం ధర రూ.475 వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టాయి. వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరును గరిష్ఠంగా రూ.250 రేటుకు విక్రయించిన సంగతి తెలిసిందే. అలాగే లిస్టింగ్ తర్వాత సైతం ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. దీంతో షేర్ల ధర ఏకంగా రూ.498.75 స్థాయిని తాకాయి.

పొజిట్రాన్ ఎనర్జీ ఐపీవో కోసం సబ్స్క్రిప్షన్ కోసం ఆగస్టు 8 నుంచి ఆగస్టు 12 వరకు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.238-250గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 600 షేర్లుగా ఉంచింది. పొజిట్రాన్ ఎనర్జీ ఐపీవో సబ్స్క్రిప్షన్ బిడ్డింగ్ చివరి రోజున 414.86 రెట్లుగా నమోదైంది. ఈ క్రమంలో మెుత్తం రిటైల్ కేటగిరీ 351.9 సార్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ కేటగిరీ 231.4 సార్లు, నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ 805.8 సార్లు బుక్ చేయబడింది.
కంపెనీ తాజా ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను ప్రధానంగా వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఆగస్టు 9న ఐపీవో రూ.14.6 కోట్లు సమీకరించింది. పొజిట్రాన్ ఎనర్జీ 2008లో స్థాపించబడింది. కంపెనీ దేశంలోని చమురు & గ్యాస్ పరిశ్రమకు నిర్వహణ, సాంకేతిక సలహా సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications