UPI Payment Reward Scam: యూపీఐ యూజర్లు 'బీ కేర్ ఫుల్'.. క్యాష్బ్యాక్ మోసాలతో జాగ్రత్త.. కొత్త రకం మోసం..
UPI Payment Reward Scam: యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక మనలో చాలా మంది డబ్బును క్యారీ చేయటం దాదాపుగా మర్చిపోయాం. పైగా అన్నిచోట్లా ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు అంగీకరిస్తున్నందున ఆ అవసరం కూడా చాలా వరకు తగ్గిపోయింది. అందుకే సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ఈ యూపీఐ చెల్లింపులను తమ మోసాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. రివార్డుల పేరుతో వినియోగదారులకు గ్యాలం వేసి ఎలా డబ్బు కొట్టేస్తున్నారు ఇప్పుడు తెలుసుకోండి..
ఓటీపీలను పంచుకోవద్దు..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపు యాప్లు మన రోజువారీ డబ్బు చెల్లించే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. చెల్లింపుల వ్యవస్థను చాలా సులువు చేశాయి. UPI చెల్లింపులకు మనం తరచుగా రివార్డ్ పాయింట్లు లేదా కూపన్లను పొందుతుంటాము. కానీ సైబర్ క్రైమ్ ప్రపంచంలో ఈ బహుమతులు కొత్తతరం దోపిడీలకు మార్గాలుగా మారాయి. అందువల్ల కూపన్ల ఎర వేసే నేరగాళ్లకు యూపీఐ పిన్, ఓటీపీ వంటి వివరాలు అస్సలు పంచుకోవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం.. UPI ట్రాన్సాక్షన్ల సంఖ్య జూన్ 2022లో రూ.10 లక్షల కోట్లు దాటింది.
హ్యాకర్లు ఇలా వల విసురుతున్నారు..
ముంబైకి చెందిన అక్షయ్ ఫోన్పే ద్వారా డబ్బు బదిలీ చేసిన తర్వాత, తనకు రూ.4,000 క్యాష్బ్యాక్ రివార్డ్ ఇస్తామని ఎరగా చూపిన హ్యాకర్ నుంచి కాల్ వచ్చిందని చెప్పాడు. వాస్తవానికి, అతనికి వాగ్దానం చేసిన రివార్డ్ యాప్ నోటిఫికేషన్ విభాగంలో కనిపిస్తుంది. దీంతో అక్షయ్ నమ్మకం బలపడింది. అయినప్పటికీ.. రివార్డ్ పొందాలంటే UPI పిన్ చెప్పాలని అడగటంతో అక్షయ్ కి అనుమానం కలిగింది. ఎందుకంటే రివార్డులకోసం పిన్, ఓటీపీ లాంటి వివరాలు వెల్లడించాల్సిన అవసరం అస్సలు ఉండదు కాబట్టి.
పిన్ ఉపయోగించి ఏమిచేస్తారంటే..
హ్యాకర్లు UPI పిన్ని పొందిన తర్వాత.. వారు ఆ వ్యక్తి స్మార్ట్ఫోన్కు యాక్సెస్ పొందుతారు. ఇలా చెల్లింపు యాప్లోని ఫైల్లను యాక్సెస్ చేయడం ద్వారా, వారు నోటిఫికేషన్ నిజమని నమ్మిచ్చే విధంగా క్యాష్బ్యాక్ నోటిఫికేషన్లను పంపుతారు. వినియోగదారులు నోటిఫికేషన్ నిజమని నమ్మి రివార్డ్ను క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తారు. క్లెయిమ్ కావాలంటే పిన్ లేదా OTPని తప్పక తెలపాలని హ్యాకర్లు కోరతారు. డబ్బులొస్తాయి కదా అని వివరాలు చెబితే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. ఎందుకంటే యూపీఐకి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల నుంచి వారు నగదును ట్రాన్ఫర్ చేస్తారు కాబట్టి.
దురాశకు పోవద్దంటున్న పోలీసులు..
తాజాగా ఇలాంటి మోసాలు మహారాష్ట్రలో ఎక్కువగా వెలుగులోకి వస్తుండటంతో యూపీఐ రివార్డ్ స్కామ్ విషయం బయకు వచ్చింది. చాలా మంది వ్యక్తులు తరచుగా ఇటువంటి క్యాష్బ్యాక్ దురాశలో చిక్కుకుంటున్నట్లు మహారాష్ట్ర సైబర్ సెల్ SP సంజయ్ షింత్రే హెచ్చరించారు. UPI పిన్ను హ్యాకర్లతో పంచుకోవద్దని సూచిస్తున్నారు. రివార్డ్లు లేదా క్యాష్బ్యాక్ను క్లెయిమ్ చేయడానికి UPI పిన్ అవసరం ఉండదని, ఈ రెండిటికీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.