రూ.10 లక్షలు, ఆ పైన చెక్ క్లియరెన్స్కు కస్టమర్ ధృవీకరణ తప్పనిసరి
అధిక వ్యాల్యూ కలిగిన చెక్కులను కస్టమర్లతో ఫునఃధృవీకరించుకున్న తర్వాతే క్లియర్ చేస్తామని ప్రభుత్వరంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 4వ తేదీ నుండి పాజిటివ్ పే సిస్టంను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. రూ.10 లక్షలు, ఆ పైన వ్యాల్యూ కలిగిన చెక్కులకు ఈ నియమం వర్తిస్తుందని తెలిపింది.
తమ కస్టమర్లకు బ్యాంకు మోసాల నుండి భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఆర్బీఐ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం జనవరి 2021 నుండి పాజిటివ్ పే సిస్టం అందుబాటులోకి వచ్చింది. రూ.50వేలు, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని చెక్కు ద్వారా చెల్లింపులు చేసేవారు అకౌంట్ నెంబర్, చెక్కు నెంబర్, చెక్కు వ్యాల్యూ, చెక్కు జారీ చేసిన తేదీ, చెల్లింపుదారుని పేరు వంటి వివరాలు బ్యాంకులతో ధృవీకరించుకోవాలి.
ఈ వివరాలను చెక్ క్లియరెన్స్కు సమర్పించడానికి 24 గంటల ముందు సమర్పించాలని తెలిపింది. ఈ వివరాలను నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ లేదా హోమ్ బ్రాంచీని సందర్శించడం ద్వారా సమర్పించవచ్చు. రూ.10 లక్షలు, అంతకుమించి చెక్ క్లియరెన్స్ పైన పీపీఎస్ (పాజిటివ్ పేమెంట్ సిస్టం) ఇక తప్పనిసరి అని పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ప్రకటనలో తెలిపింది.