తెలంగాణ కేంద్రంగా మోదీ సర్కారు నయా స్కెచ్.. రూ. 9, 400 కోట్ల పనులు.. డబుల్ ఇంజిన్ సర్కార్పై గురి..
తెలంగాణ రాజకీయ యవనికపై మరోసారి ఎన్నికల వేడి రగులుతోంది. మే 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, అలాగే ఇటీవల అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయాల నేపథ్యంలో మోదీ తెలంగాణ గడ్డపై అడుగుపెడుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రధాని మోదీ పర్యటన కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, తెలంగాణ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనుంది. దాదాపు రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ పర్యటనలో మోదీ ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ (HICC) నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాను నాలుగు లేన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాజీపేట-విజయవాడ మధ్య నూతనంగా నిర్మించిన మల్టీ-ట్రాకింగ్ రైల్వే లైన్లను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఇక వరంగల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పిఎం మిత్రా (PM MITRA) టెక్స్టైల్ పార్క్, హైదరాబాద్లోని నూతన పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్ (POL) టెర్మినల్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది.
అభివృద్ధి కార్యక్రమాల అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై బీజేపీ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి. దాదాపు రెండు లక్షల మంది జన సమీకరణ చేయడమే లక్ష్యంగా పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా 'గోడలపై రాత' ప్రచారం, బైక్ ర్యాలీలతో ఇప్పటికే కేడర్లో ఉత్సాహం నింపారు.
కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నేతృత్వంలో ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రమిస్తోంది. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల నిధులు కేటాయిస్తోందని, ఈ నిధులు ప్రజలకు నేరుగా చేరాలన్నా, తెలంగాణ వేగవంతమైన వృద్ధి సాధించాలన్నా 'డబుల్ ఇంజిన్ సర్కార్' (కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ పాలన) అవసరమని బండి సంజయ్ వంటి నాయకులు బలంగా వినిపిస్తున్నారు.
తెలంగాణను బీజేపీకి దక్షిణాదిలో అత్యంత కీలకమైన రాష్ట్రంగా మోదీ, అమిత్ షా బృందం భావిస్తోంది. గత ఎన్నికల ఫలితాలు ఇక్కడ బీజేపీ బలాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో, మోదీ ప్రసంగం రాష్ట్రంలోని అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, కేంద్రం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించే విధంగా ఉండబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రధాని మోదీ రాకతో తెలంగాణ బీజేపీ విభాగంలో కొత్త జోష్ వస్తుందని, ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పునాదిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద మే 10వ తేదీన హైదరాబాద్ పర్యటన అటు అభివృద్ధి పరంగా, ఇటు రాజకీయ పరంగా తెలంగాణలో ఒక కొత్త అధ్యయనానికి తెరలేపనుంది. ఈ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారతాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications
