కరోనా, యుద్ధాలు, ఇంధన సంక్షోభం.. మళ్లీ పేదరికంలోకి ప్రపంచం? మోదీ సంచలన వ్యాఖ్యలు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లోని ది హేగ్ (The Hague) లో భారత సంతతిని ఉద్దేశించి ఆయన సంచలన ప్రసంగం చేశారు.
"మొదట కరోనా మహమ్మారి వచ్చింది, ఆ తర్వాత యుద్ధాలు మొదలయ్యాయి, ఇప్పుడు తీవ్రమైన ఇంధన సంక్షోభం (Energy Crisis) నడుస్తోంది. ఈ దశాబ్దం అంతా ప్రపంచానికి ఒక విపత్తుల దశాబ్దంగా (Decade of Disasters) మారుతోంది" అని మోదీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ సంక్షోభాలను గనుక త్వరగా అదుపు చేయకపోతే, గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం సాధించిన ప్రగతి అంతా తుడిచిపెట్టుకుపోయి, కోట్లాది మంది ప్రజలు మళ్లీ తీవ్ర పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

దేశంలో పెరిగిన ఇంధన ధరలు.. లీటరుకు రూ. 3 పెంపు!
అంతర్జాతీయంగా ముడిచమురు సంక్షోభం ముదురుతున్న తరుణంలో, దేశీయంగా నాలుగు సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (IOC, BPCL, HPCL) పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 3 మేర పెంచాయి. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.77 కు, డీజిల్ ధర రూ. 90.67 కు చేరుకుంది. స్థానిక పన్నులను బట్టి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ ధరలు మరికొంత ఎక్కువగా ఉన్నాయి. ఈ చమురు ధరల (fuel price) పెంపు ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా.. రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, వ్యవసాయం , తయారీ రంగాల ఇన్పుట్ ఖర్చులపై పడి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం (Inflation) మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతిపక్షాల విమర్శలు.. కేంద్రం ఏమంటోంది?
మరోవైపు ఈ పెట్రోల్ ధరల (fuel price) పెంపుపై రాజకీయ రచ్చ మొదలైంది. కీలక రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఈ ధరల భారాన్ని ప్రజలపై మోపిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే అధికార పక్షం బీజేపీ ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నా.. దాదాపు 76 రోజుల పాటు ప్రభుత్వ చమురు సంస్థలు ఆ భారాన్ని భరించి దేశ ప్రజలను కాపాడాయని, ఇప్పుడు చాలా పరిమితంగా, తప్పనిసరి పరిస్థితుల్లోనే స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
ప్రధాని మోదీ 'పొదుపు' మంత్రం
యూరప్ పర్యటనకు వెళ్లే ముందు హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు కొన్ని స్వచ్ఛంద పొదుపు సూత్రాలను (Austerity Measures) ప్రతిపాదించారు. ఇంధనాన్ని ఆదా చేయడం, విదేశీ మారక ద్రవ్యాన్ని (Foreign Exchange) కాపాడటం కూడా ఒక రకమైన 'దేశభక్తి' అని ఆయన అభివర్ణించారు. ఇందుకోసం ప్రజలు కొన్ని అలవాట్లను మార్చుకోవాలని కోరారు..
- సాధ్యమైనంత వరకు ఐటీ , ఇతర ఉద్యోగులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Remote Work) చేయాలి.
- అనవసరమైన విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.
- బంగారం కొనుగోళ్లను (Gold Purchases) తగ్గించుకోవాలి.
- వ్యక్తిగత వాహనాలకు బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్పూలింగ్ వంటి మార్గాలను ఎంచుకోవాలి.
అసలు ఈ సంక్షోభానికి కారణం ఏమిటి?
ప్రస్తుత అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ప్రధాన కారణం ఇరాన్ దేశం 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) జలసంధిని మూసివేయడమే. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం ముడిచమురు వ్యాపారంలో దాదాపు 20 శాతం ఇంధన రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) దీనిని ప్రపంచ చమురు మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద సరఫరా అంతరాయంగా పేర్కొంది. భారతదేశం తన అవసరాలకు కావాల్సిన చమురులో 90 శాతం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. అందులోనూ సగం సరఫరా ఈ జలసంధి గుండానే రావాల్సి ఉండటంతో భారత్పై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా చూపిస్తోంది. అందుకే ఆసియాలోని మిగిలిన దేశాల తరహాలోనే (ఫిలిప్పీన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీ, జపాన్ అత్యవసర నిల్వల విడుదల) భారత్ కూడా ముందు జాగ్రత్తగా ఇంధన పొదుపు చర్యలపై దృష్టి పెట్టింది.


Click it and Unblock the Notifications