భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం..నేడు ప్రధాని మోదీ నేతృత్వంలో శిఖరాగ్ర సమావేశం.. అమెరికా కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ యూరోపియన్ యూనియన్-భారత్ (EU-India) శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ కీలక సమావేశంలో యూరోపియన్ యూనియన్ తరఫున యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ పాల్గొననున్నారు. భారత్-EU మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ శిఖరాగ్ర సమావేశం ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు.
యూరోపియన్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సమావేశం ద్వారా వాణిజ్యం, భద్రత, రక్షణ, స్వచ్ఛమైన పరివర్తన (గ్రీన్ ట్రాన్సిషన్), ప్రజల నుండి ప్రజల సహకారం వంటి కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకునే అవకాశం ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్-EU సంబంధాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ శిఖరాగ్ర సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్న అంశాల్లో భారత్-EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అత్యంత కీలకం కానుంది. ఈ ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిశాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల వెల్లడించారు. చట్టపరమైన పరిశీలన (లీగల్ స్క్రబ్) పూర్తయ్యాక, ఐదు నుంచి ఆరు నెలలలో అధికారికంగా ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం సమతుల్యంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిందని, ఇది భారత్-EU మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు కొత్త ఊపునిస్తుందని ఆయన పేర్కొన్నారు.
EU-భారత్ సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా సానుకూల దిశలో కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2025లో యూరోపియన్ కౌన్సిల్ కొత్త వ్యూహాత్మక EU-భారత్ ఎజెండాను ఆమోదించింది. ఈ నేపథ్యంతో, ఈ శిఖరాగ్ర సమావేశంలో నాలుగు ప్రధాన రంగాలపై దృష్టి పెట్టనున్నారు. అవి శ్రేయస్సు - స్థిరత్వం, సాంకేతికత - ఆవిష్కరణ, భద్రత - రక్షణ, కనెక్టివిటీ - ప్రపంచ సమస్యలు.
EU ట్రేడ్ కమిషనర్ మార్కోస్ సెఫ్కోవిక్ ఇటీవల యూరో న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ FTA ఒప్పందాన్ని అన్ని ఒప్పందాలకు తల్లి గా అభివర్ణించారు. భారతదేశంలో కొన్ని రంగాల్లో 150 శాతం వరకు ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించడంపై చర్చలు కీలక దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం దాదాపు 2 బిలియన్ల జనాభాతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాన్నిసృష్టించగలదని చెప్పారు.
అధికారిక ప్రకటనల ప్రకారం.. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, మధ్యప్రాచ్య పరిస్థితులు, బహుపాక్షిక వ్యవస్థల ప్రాముఖ్యత వంటి ప్రపంచ అంశాలపై కూడా చర్చ జరగనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ.. విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా మారుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కూడా కోస్టా, వాన్ డెర్ లేయన్లకు ఆతిథ్యం ఇవ్వడం భారత్కు గౌరవమని పేర్కొంటూ.. ఇది భారత్-EU భాగస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.
ఇదిలా ఉంటే భారత్, యురోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా 25 శాతం సుంకాలు విధించినప్పటికీ, ఆ నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ దేశాలు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఉదాహరణగా చూపుతూ.. వాస్తవంగా ఏం జరుగుతోందో గమనించాలని ఆయన అన్నారు.
రష్యా నుంచి చమురు తొలుత భారత్కు చేరుతుందని, అక్కడ శుద్ధి చేసిన తర్వాత అదే చమురు ఉత్పత్తులు యూరప్కు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. వాటిని యూరోపియన్ దేశాలే కొనుగోలు చేస్తున్నాయని, ఈ ప్రక్రియ ద్వారా పరోక్షంగా రష్యా యుద్ధానికి నిధులు సమకూరుతున్న పరిస్థితి ఏర్పడుతోందని బెసెంట్ విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత్వంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు వస్తుందన్న నమ్మకాన్ని బెసెంట్ వ్యక్తం చేశారు. ఈ సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ సీరియస్గా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ యుద్ధం విషయంలో యూరోపియన్ దేశాల కంటే అమెరికానే ఎక్కువ త్యాగాలు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ త్యాగాలు ఏవో వివరంగా వెల్లడించలేదు.
భారత్పై అమెరికా విధించిన సుంకాల విషయంలో కూడా బెసెంట్ కీలక సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న టారిఫ్లు సగానికి తగ్గే అవకాశం ఉందని ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా తగ్గించిందని పేర్కొంటూ.. దాన్ని ఒక పెద్ద విజయంగా అభివర్ణించారు. అయితే, చమురు విషయంలో మాత్రం ఇంకా సుంకాలు అమల్లోనే ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించేందుకు ఒక మార్గం ఉందని భావిస్తున్నానని చెప్పడం ద్వారా.. భవిష్యత్తులో భారత్పై విధించిన టారిఫ్లను సడలించే అవకాశాన్ని పరోక్షంగా సంకేతమిచ్చారు.


Click it and Unblock the Notifications


