భారతదేశంలోకి ప్లాస్టిక్ నోట్లు? RBI సంచలన ప్లాన్.. త్వరలోనే మీ చేతుల్లోకి సరికొత్త కరెన్సీ!
మన దేశంలో నోట్ల రద్దు (Demonetisation) జరిగి ఇన్నేళ్లు అవుతున్నా, యూపీఐ (UPI) లాంటి డిజిటల్ పేమెంట్లు విపరీతంగా పెరిగినా.. సామాన్య ప్రజల్లో నగదు (Cash) వాడకం మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ క్రమంలోనే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కరెన్సీ నోట్లకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరెన్సీ డిమాండ్ను తట్టుకోవడానికి, త్వరలోనే 'పాలిమర్' లేదా 'ప్లాస్టిక్' బ్యాంక్ నోట్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. పాట్నా, ముంబైలలో జరిగిన ఆర్బీఐ గత రెండు బోర్డు సమావేశాలలో ఈ ప్లాస్టిక్ కరెన్సీ ప్రపోజల్స్ పై తీవ్రమైన చర్చలు జరిగాయని సమాచారం.

ఎందుకు ఈ ప్లాస్టిక్ నోట్ల ఆలోచన?
ప్రస్తుతం మనం వాడుతున్న కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను తయారు చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అంతేకాదు, ఈ నోట్ల ఆయుష్షు (Shelf Life) చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి అంత సులభంగా చినిగిపోవు, మురికి కావు, నీళ్లలో నానినా పాడవవు. "ఈ ప్లాస్టిక్ నోట్ల తయారీ వల్ల ప్రభుత్వానికి ఖర్చు బాగా తగ్గుతుంది. అంతేకాదు, ఏటీఎం (ATM) యంత్రాలు కూడా ఈ సరికొత్త పాలిమర్ నోట్లను సులభంగా డిస్పెన్స్ (పంపిణీ) చేసేలా సాంకేతికతను తీసుకురావడానికి మన దగ్గర పూర్తి వనరులు ఉన్నాయి" అని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే ఒక పైలట్ ప్రాజెక్ట్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
నోట్ల ముద్రణ ఖర్చు భారంగా మారిందా?
ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం.. కాగితం నోట్లను ముద్రించడానికి అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,101.4 కోట్లుగా ఉన్న నోట్ల ముద్రణ ఖర్చు, ఈసారి ఏకంగా రూ. 6,372.8 కోట్లకు చేరుకుంది. దీనికి తోడు, పాడైపోయిన , పాత నోట్లను (Soiled Notes) మార్చడం, వాటిని డిస్పోజ్ చేయడం పెద్ద సవాలుగా మారింది. గత ఏడాది దాదాపు 2,380 కోట్ల పాత నోట్లను RBI వెనక్కి తీసుకుంది. ఇందులో ఎక్కువగా రూ. 500 , రూ. 100 నోట్లే ఉన్నాయట. ఈ సమస్యలన్నింటికీ ప్లాస్టిక్ నోట్లు ఒక పక్కా పరిష్కారంగా మారనున్నాయి.
డిజిటల్ యుగంలోనూ రికార్డ్ స్థాయిలో నగదు చలామణి!
మనదేశంలో గూగుల్ పే, ఫోన్ పే లు ఎంత వాడుతున్నా.. చేతిలో నగదు ఉంచుకోవడానికే జనాలు ఇష్టపడుతున్నారు. మే 15 నాటి లెక్కల ప్రకారం.. దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ ఏకంగా రూ. 42.86 ట్రిలియన్ల రికార్డు స్థాయికి చేరుకుంది. అంటే కేవలం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఒకటిన్నర నెలల్లోనే మార్కెట్లోకి అదనంగా రూ. 1.15 ట్రిలియన్ల నగదు వచ్చి చేరింది.
మరోవైపు రూ. 10, రూ. 20 లాంటి చిన్న నోట్లకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా ఉన్నా.. మొత్తం కరెన్సీ విలువలో వీటి వాటా కేవలం 0.7% , 0.8% మాత్రమే ఉంది. నాణేల (Coins) వాడకాన్ని పెంచాలని RBI చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు.
2012 లోనే ట్రై చేశారు కానీ..
నిజానికి ప్లాస్టిక్ నోట్లను ఇండియాలోకి తేవాలనే ఆలోచన ఈనాటిది కాదు. 2012 లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ. 10 ప్లాస్టిక్ నోట్లను దేశంలోని ఐదు నగరాల్లో ట్రయల్ రన్ కింద విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. నోట్ల మన్నికను పెంచడమే దాని ముఖ్య ఉద్దేశం. కానీ ఆ సమయంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మన ఏటీఎంలు కూడా అప్గ్రేడ్ అయ్యాయి కాబట్టి.. త్వరలోనే ఈ ప్లాస్టిక్ నోట్లను మనం నిజంగానే వాడబోతున్నాం. ఇదొక రకంగా కరెన్సీ ప్రపంచంలో సరికొత్త విప్లవమనే చెప్పాలి!


Click it and Unblock the Notifications