ముఖేష్ అంబానీ చేతికి మరో చెక్కు! సౌదీ సంస్థ భారీ పెట్టుబడి
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ రిటైల్లోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. అంతకుముందు జియోలోకి భారీగా పెట్టుబడులు సమీకరించిన ముఖేష్ అంబానీ ఇప్పుడు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(RRVL)పైన దృష్టి సారించారు. ప్రపంచంలోని అతిపెద్ద సావరీన్ వెల్త్ ఫండ్స్లో ఒకటైన సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(PIF) 2.05 శాతం వాటాలను కోనుగోలు చేస్తోంది. రూ.9,555 కోట్లతో (1.3 బిలియన్ డాలర్లు) ఈ వాటాను దక్కించుకోనుంది. దీంతో రిలయన్స్ రిటైల్లోకి ఇది ఎనిమిదో పెట్టుబడి.
2009 తర్వాత.. ఈసారి వేతన పెంపు ఎంత ఉందంటే: 2021లో శాలరీ పెంచే కంపెనీలు 87%
రూ.47,265 కోట్లు సమీకరణ
రిలయన్స్ రిటైల్ ప్రీ-ఈక్విటీ మనీ వ్యాల్యూ రూ.4,587 లక్షల కోట్ల (62.4 బిలియన్ డాలర్లు) వద్ద ఈ డీల్ కుదిరింది. PIF ఇంతకుముందు రిలయన్స్ జియో ప్లాట్ఫాంలో 2.32 శాతం వాటాను దక్కించుకుంది. ఇప్పటి వరకు రిలయన్స్ రిటైల్లో 10.09 శాతం వాటాను విక్రయించారు. రూ.47,265 కోట్లు సమీకరించారు. ఇంతకుముందు సింగపూర్ సావరీన్ వెల్త్ ఫండ్ జీఐసీ, గ్లోబల్ ఆల్టర్నేటివ్ అసెట్ సంస్థ టీపీజీ, అబుదాబీఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ముబాదాల, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, సిల్వర్ లేక్ (ఈ సంస్థ రెండుసార్లు) పెట్టుబడులు పెట్టాయి.
ముఖేష్ అంబానీ ఏమన్నారంటే
సౌదీ అరేబియాతో తమకు సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయని, సౌదీ ఎకనమిక్ ట్రాన్సుఫార్మేషన్లో PIF ముందు ఉందని రిలయన్స్ అదినేత ముఖేష్ అంబానీ అన్నారు. 130 కోట్ల మంది భారతీయుల, లక్షలాది మంది చిన్న వ్యాపారాల జీవితాన్ని మార్చేందుకు, భారత రిటైల్ రంగాన్ని మార్చే దిశలో తమ ప్రయాణం కొనసాగుతోందని, ఇందులో PIF భాగస్వామ్యం కావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వారి నిరంతర మద్దతు, మార్గదర్శకత్వం కోసం చూస్తున్నామన్నారు. ఈ పెట్టుబడి భారత ఆర్థిక వ్యవస్థను, పీఐఎఫ్ ఉనికిని మరింత బలోపేతం చేస్తుందన్నారు.
ఇదీ పీఐఎఫ్
సౌదీ అరేబియాకు చెందిన PIFను 1971లో స్థాపించారు. సౌదీ ప్రభుత్వం తరఫున పెట్టుబడుల కోసం దీనిని ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో దేశీయ, అంతర్జాతీయస్థాయిలో ఈ సంస్థ పెట్టుబడులు పెడుతోంది. స్థిరమైన రాబడి కోసం దీర్ఘకాలిక పెట్టుబడులు, వివిధ సంస్థల్లో పెట్టుబడి భాగస్వామిగా ఉండటం వంటి వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది.