పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: అక్కడ సరికొత్త రికార్డ్
ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. వారం రోజులుగా స్థిరంగా ఉన్న ధరలను నేడు పెంచుతూ చమురు విక్రయ కంపెనీలు ఈ రోజు (బుధవారం, జనవరి 13) నిర్ణయించాయి. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల చొప్పున పెరిగాయి. చివరిసారి జనవరి 6న ధరలు లీటర్ పెట్రోల్ పైన 26 పైసలు, డీజిల్ పైన 25 పైసలు చొప్పున పెరిగాయి. అంతకుముందు దాదాపు నెల రోజుల పాటు ధరల్లో మార్పులేదు. వారం తర్వాత ఇప్పుడు మళ్లీ పెరిగాయి.
దక్షిణాదిన రియాల్టీ అదుర్స్, హైదరాబాద్లో ఇళ్ల ధరలు జంప్
పెట్రోల్ రూ.91 క్రాస్
పెరిగిన అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.84.45, లీటర్ డీజిల్ రూ.74.63గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.91.07, లీటర్ డీజిల్ రూ.81.34గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.87.18, లీటర్ డీజిల్ రూ.79.95గా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.85.92, లీటర్ డీజిల్ రూ.78.22గా ఉంది.
ముంబైలో పెట్రోల్ ధరలు రూ.91ని దాటాయి. జయపురలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికస్థాయికి చేరాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.91.85, డీజిల్ రూ.83.87గా ఉంది.హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.85, లీటర్ డీజిల్ ధర రూ.81,45గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో జంప్
అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి. డబ్ల్యుటీఐ క్రూడ్, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు వరుసగా 1.3 శాతం పెరిగి 53.88 డాలర్లు, 79 సెట్లు పెరిగి 57.37 డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సగటున ఒక బ్యారెల్కు ఒక డాలర్ పెరిగితే, ఏడాదికి భారత్ ఇంపోర్ట్ బిల్ రూ.10,700 పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా భారత చమురురంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి.
ఇటీవల కీలక నిర్ణయం
చమురు ఉత్పత్తి స్వచ్చంధ కోతకు ఇటీవల సౌదీ అరేబియా సిద్ధమైంది. ఈ ప్రభావం చమురు ధరలపై పడుతోంది. చమురు ఉత్పత్తి దేశాలు ఇటీవల సమావేశమైనప్పుడు ఉత్తత్తి కోతపై నిర్ణయం తీసుకున్నాయి. ఆ సమయంలో అంచనాల కంటే ఎక్కువగా సౌదీ అరేబియా ఉత్పత్తి కోతకు సిద్దఫడింది. దీంతో చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.