పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్లో ఎంత ఉందంటే
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం (జనవరి 18) పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 25 పైసలు పెరగడంతో సరికొత్త గరిష్టాన్ని తాకింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో పెట్రోల్ రూ.84.70 నుండి రూ.84.95కు పెరిగింది. డీజిల్ కూడా లీటర్ పైన 25 పైసలు పెరిగి రూ.74.88 నుండి రూ.75.13కి చేరుకుంది. అంతకుముందు వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న చమురు ధరలు గత బుధవారం 25 పైసల చొప్పున పెరిగాయి. నేడు మరోసారి పెరిగాయి.
విలువలేదు: బిట్ కాయిన్, టెస్లా జంప్పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.84.95, లీటర్ డీజిల్ రూ.75.13గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.91.56, డీజిల్ రూ.81.87, చెన్నైలో పెట్రోల్ రూ.87.63, డీజిల్ రూ.80.43, కోల్కతా పెట్రోల్ 86.39, డీజిల్ రూ.78.72గా ఉంది. హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు 26 పైసలు పెరిగి వరుసగా రూ.88.3, డీజిల్ రూ.81.99గా ఉంది. మరో రూ.1.60 పెరిగితే హైదరాబాద్లో పెట్రోల్ రూ.90కి చేరుకుంటుంది.
పదిహేను రోజుల్లో మూడోసారి
చమురురంగ మార్కెటింగ్ కంపెనీలు జనవరి ఏడో తేదీన పెట్రోల్ పైన 23 పైసలు, డీజిల్ పైన 26 పైసల పెంపును ప్రకటించాయి. గత పదిహేను రోజుల్లో ధరలు మూడోసారి పెరిగాయి. 2020 క్యాలెండర్ ఏడాది మధ్యలో పెట్రోల్ ధర రూ.80ని తాకింది. ఆ తర్వాత అప్పుడప్పుడు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో అక్టోబర్ 4, 2018వ తేదీన పెట్రోల్ అత్యధికంగా రూ.84 నమోదయింది.
క్రూడ్ ధరలు
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా సహా చమురు ఉత్పత్తి దేశాలు ఇటీవల ఉత్పత్తి కోతపై నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు, కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రభావంతో డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల మాత్రం క్రూడ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. డబ్ల్యుటీఐ క్రూడ్ 0.36 శాతం, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 0.51 శాతం తగ్గాయి.