పెరిగిన పెట్రోల్ ధర, తగ్గిన డీజిల్ ధర: వ్యాట్ ఏపీ, తెలంగాణలోను ఎక్కువే
పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు రంగ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC) ప్రకారం నేడు(జూలై 12 సోమవారం) పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో 28 పైసలు పెరిగి రూ.100.91 నుండి రూ.101.19కి పెరిగింది. అయితే డీజిల్ ధర మాత్రం తగ్గింది. డీజిల్ ధర 27 పైసలు క్షీణించింది. ఢిల్లీలో డీజిల్ రూ.89.72కు తగ్గింది. నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. ఇక్కడ రూ.107 క్రాస్ చేసింది. డీజిల్ ధర కూడా ఎక్కువే ఉంది. తాజా పెరుగుదలతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.20, డీజిల్ 27 పైసలు తగ్గి రూ.97.29 వద్ద ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.101.92, లీటర్ డీజిల్ రూ.94.24, కోల్కతాలో పెట్రోల్ రూ.101.35, డీజిల్ రూ.92.81గా ఉంది. పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.