పెట్రోల్ ధరలు రూ.150కి చేరుకోవచ్చు.. ఎప్పటి వరకు అంటే?
పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో రూ.150 దాటే అవకాశం కనిపిస్తోందని కేంద్ర మాజీ పెట్రోలియం శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పెట్రోల్ ధర లీటర్కు రూ.150 అవుతుందన్నారు. ఈ మేరకు ఆయన గురువారం కుంబకోణం సమీపంలోని తటువంచేరి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు పలు ప్రాంతాల్లో రూ.120 వద్ద, డీజిల్ రూ.100 దాటాయి. ఎల్పీజీ, పెట్రోల్ సహా అన్ని పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇటీవల పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
కాగా, ఇంధన ధరలు ఇటీవల భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు 35 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.108.64 క్రాస్ చేసింది. హైదరాబాద్ నగరాల్లో రూ.113 వద్ద ఉంది. ఈ అక్టోబర్ నెలలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన రూ.7కు పైగా పెరిగింది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.108.64, లీటర్ డీజిల్ రూ.97.37గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.114.47గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.105.49గా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.109.02, డీజిల్ రూ.100.49, చెన్నైలో పెట్రోల్ రూ.105.43, డీజిల్ రూ.101.59, హైదరాబాద్లో పెట్రోల్ రూ.113, డీజిల్ రూ.106.22గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు మున్ముందు 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే దేశంలోను పెట్రోల్ ధరలు రూ.150కి చేరుకోవచ్చు. వచ్చే ఏడాది నాటికి బ్రెంట్ క్రూడ్ ధర 110 డాలర్లకు చేరుకుంటుందని ఇప్పటికే గోల్డ్మన్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఇక్కడ ధరలు పెంచకతప్పదు.