Petrol prices today: స్థిరంగా పెట్రోల్ ధరలు, క్యాబ్ ధరలు పెంచిన ఉబర్, ఓలా
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడో రోజు స్థిరంగా ఉన్నాయి. బుధవారం, ఏప్రిల్ 13వ తేదీన ధరల్లో ఎలాంటి మార్పులేదు. చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పెరుగుదల ప్రారంభమైంది. మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఇటీవల స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, లీటర్ డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. గురుగ్రామ్లో పెట్రోల్ రూ.105.86, డీజిల్ రూ.97.10గా ఉంది.
మార్చి 22వ తేదీ నుండి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను సవరిస్తున్నాయి. మొత్తం 23 రోజులలో 14 రోజులు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77, చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94, కోల్కతాలో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83, బెంగళూరులో పెట్రోల్ రూ.111.09, డీజిల్ రూ.94.79గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49 వద్ద ఉంది.
ఇదిలా ఉండగా, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబర్ క్యాబ్ ధరలను పెంచింది. ఢిల్లీ, కోల్కతా, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ధరలు రూ.100 దాటాయి. దీంతో ఛార్జీని పెంచింది. ఢిల్లీ, కోల్కతాలలో 12 శాతం, హైదరాబాద్, ముంబైలలో 15 శాతం పెంచినట్లు తెలిపింది. ఓలా కూడా మేజర్ సిటీలలో ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది. తమ మినీ, ప్రైమ్ క్యాబ్స్కు హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో 16 శాతం పెంచినట్లుగా తెలుస్తోంది.