భారత్ మీద ఎప్పుడుపడితే అప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. పెరిగిన ధరలతో అక్కడి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే దాయాది దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెవిన పడేసింది. పాకిస్తాన్ ప్రజల కష్టాలను మరింత పెంచుతూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.ఇప్పటికే పెరిగిన వస్తువుల ధరలు, నిరుద్యోగం, దినసరి ఖర్చుల భారం వంటి వాటితో సతమతమవుతున్న పాక్ ప్రజలు.. తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.
రెండు వారాల కాలానికి ఇంధన ధరలను పెంచుతున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అయితే పదిహేను రోజుల వ్యవధిలో ఇంధన ధరలను రెండు సార్లు పెంచింది పాకిస్తాన్ ప్రభుత్వం. జూన్ 16 2025న పాక్ ప్రభుత్వం పెట్రోల్పై రూ.4.80, డీజిల్పై రూ.7.95 పెంచి ప్రజలకు షాకిచ్చింది.. తాజాగా నేడు జూలై 1న మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అమల్లోకి వచ్చింది. తాజా పెంపుతో పెట్రోల్ ధర లీటర్కు రూ.8.36 పెరిగింది. దీంతో దాయాది దేశంలో .258.43 ఉన్న పెట్రోల్ ధర తాజా పెంపుతో రూ.266.79కి చేరుకుంది. ఇక డీజిల్ ధర లీటర్కు రూ. 10.39 పెరగడంతో అది కాస్తా రూ.262.59 నుంచి రూ.272.98కి చేరుకుంది.

ప్రస్తుతం పెరిగిన ధరలు OGRA (Oil and Gas Regulatory Authority), సంబంధిత మంత్రిత్వ శాఖల సిఫారసుల మేరకు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల మార్పులే ఈ పెరుగుదలకు కారణంగా ప్రభుత్వం పేర్కొంది.అయితే విచిత్రం ఏంటంటే.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. కాని పాకిస్తాన్ మాత్రం ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థుతుల కారణమని ప్రజలకు నచ్చజెబుతోంది.
ఈ ధరలను పెంచడంతో పాటు ప్రజల నడ్డి విరిచేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.2.50 కార్బన్ లెవీ విధిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్పై PDL, అలాగే డీజిల్పై PDL రూ.74.51 కార్బన్ లెవీని విధించారు. అయితే ఇవి వేరు వేరు పన్నులు కాకపోయినప్పటికీ దాయాది దేశంలో వినియోగదారుల జేబులకు భారీగా చిల్లులు పడనున్నాయి. తాజాగా ఇంధన ధరల పెంపుతో పాకిస్తాన్ ప్రజలు.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఇప్పటికే నిత్యావసరాల ధరలు చుక్కలు చూపించే స్థితిలో ఉండగా, ఇంధన ఖర్చులు పెరగడం వలన రవాణా, సరకు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. చిన్న మధ్య తరగతి వర్గాలు ఈ పెంపుతో తీవ్రంగా ప్రభావితం కానున్న నేపథ్యంలో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు OGRA, సంబంధిత అధికారులు ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications