Petrol, Diesel Rates: ఆరో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజు పెరిగాయి. గతవారం సోమ, మంగళవారాలు ధరలు పెరగలేదు. బుధవారం నుండి వరుసగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశీయంగా కూడా ధరలు ఎప్పటికి అప్పుడు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఇంధన ధరలు నేడు లీటర్ పైన 35 పైసలు పెరిగింది. ఈ రెండేళ్ల కాలంలో డొమెస్టిక్ పెట్రోల్ ధరలు 32 శాతం, డీజిల్ 46 శాతం పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF లేదా జెట్ ఫ్యూయల్) కంటే ఇప్పుడు పెట్రోల్ 35 శాతం ఎక్కువగా ఉంది. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు రూ.79,020గా ఉంది. అంటే లీటర్కు రూ.79కి కాస్త పైన ఉంది. కానీ లీటర్ పెట్రోల్ మాత్రం ఢిల్లీలో రూ.109 పైన ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు మరో 35 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.109 క్రాస్ చేసింది. హైదరాబాద్ నగరాల్లో రూ.114 దాటింది. ఈ అక్టోబర్ నెలలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన రూ.8కు పైగా పెరిగింది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.109.69, లీటర్ డీజిల్ రూ.98.42గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.115.50గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.106.62గా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.110.15, డీజిల్ రూ.101.56, చెన్నైలో పెట్రోల్ రూ.106.35, డీజిల్ రూ.102.59, హైదరాబాద్లో పెట్రోల్ రూ.114.12, డీజిల్ రూ.107.40గా ఉంది. రాజస్థాన్లోని గంగానగర్లో లీటర్ పెట్రోల్ రూ.121.78, లీటర్ డీజిల్ రూ.112.71గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో ఇంధన ధరలు మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ఓ జిల్లాలో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.120 దాటింది. ఇక, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.112కి పైన ఉన్నాయి. డీజిల్ ధరలు కూడా పలుచోట్ల రూ.110 వద్ద ఉండగా, ఎక్కువ ప్రాంతాల్లో రూ.100 దాటింది. మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లా కేంద్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.40, డీజిల్ రూ.110కి చేరువైంది. జబల్పూర్ ఆయిల్ డిపో నుండి అనుుప్పూర్ జిల్లా కేంద్రానికి పెట్రోల్ సరఫరా అవుతుంది. అందుకే ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ధరలు ఎక్కువ. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బాలాఘాట్లో లీటర్ పెట్రోల్ రూ.119.23, భోపాల్లో రూ.116.62 వద్ద ఉంది. అక్టోబర్ నెలలో చమురు ధరలు 20సార్లు పెరిగాయి.
గత కొద్దికాలంగా ధరలు దాదాపు ప్రతిరోజు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్, తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది నెలలుగా పెరగలేదు. గత నెల నుండి పెరుగుతున్నాయి. అంతకుముందు పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. రెండు నెలలకు పైగా స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు గత నెల చివరి నుండి మళ్లీ పెరగడం ప్రారంభమైంది. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి పెరగలేదు. గత నెల రోజులుగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా కొద్ది రోజుల క్రితం వరకు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు అక్కడ పెరుగుతుండటంతో ఇక్కడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ధరలను సవరిస్తాయి. జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. గత ఆగస్ట్ నెలలో ధరలు ఒక్కసారి పెరగలేదు. పైగా డీజిల్, పెట్రోల్ ధరలు పలుమార్లు తగ్గాయి. సెప్టెంబర్ నెలలో చివరి నుండి పెరగడం ప్రారంభమైంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ రూ.100 క్రాస్ చేయగా, డీజిల్ కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో అలాగే ఉంది.
వివిధ నగరాల్లో పెట్రోల్ ధర రూ.110 దాటింది. ముంబైలో రూ.113 దాటగా, హైదరాబాద్లో రూ.112 దాటింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటాలు అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్ మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. చమురు డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 80 డాలర్లు దాటింది. బ్రెంట్ క్రూడ్ ధర 85 డాలర్ల వద్ద ఉంది. 2018 అక్టోబర్ తర్వాత ఇది గరిష్టం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మూడేళ్ల గరిష్టాన్ని తాకాయి.