వరుసగా 2వ రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్లో ఎంతంటే
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండోరోజు క్షీణించాయి. నిన్న క్షీణించిన ధరలు నేడు (గురువారం మార్చి 25) కూడా స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది కాలంలో చమురు ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. నేడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 21 పైసలు తగ్గి రూ.90.99 నుండి రూ.90.78గా ఉండగా, లీటర్ డీజిల్ ధర 20 పైసలు క్షీణించి రూ.81.30 నుండి రూ.81.10కి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం గం.6కు సవరిస్తాయి.
ICICI సరికొత్త సదుపాయం: రూ.5 లక్షల వరకు ఫీజులు, ఇన్సురెన్స్ ఇలా ఈజీగా..
వివిధ నగరాల్లో ధరలు
తాజా తగ్గింపుతో వివిధ మెట్రో నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ రూ.90.78, ముంబైలో రూ.97.19, చెన్నైలో రూ.92.77, కోల్కతాలో రూ.90.98, హైదరాబాద్లో రూ.94.39, బెంగళూరులో రూ.93.82, నోయిడాలో రూ.89.08, పుణేలో రూ.96.83చండీగఢ్లో రూ.87.36గా ఉంది. ఢిల్లీలో డీజిల్ ధర లీటర్ రూ.81.30, ముంబైలో రూ.88.20, చెన్నైలో రూ.86.10, కోల్కతాలో రూ.83.98, హైదరాబాద్లో రూ.88.45, బెంగళూరులో రూ.85.99, నోయిడాలో రూ.81.56, చండీగడ్లో రూ.80.80గా ఉంది. త్వరలో ఐదు రష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగకపోవడం చమురు రంగ కంపెనీలు ధరలు తగ్గించడం సామాన్యులకు కొంతలో కొంత ఊరట. అయితే ఏడాదిలో ధరలు తగ్గడం ఇదే మొదటిసారి.
అస్థిరంగా ధరలు
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గత రెండు రోజులుగా అస్థిరంగా ఉన్నాయి. సూయజ్ కాలువ వద్ద భారీ ఎత్తున కార్గో షిప్స్, ఆయిల్ ట్యాంకర్లతో నిలిచిపోయాయి. దీంతో తగ్గిన ధరలు మళ్లీ హఠాత్తుగా పెరిగాయి. అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో ఇంధన డిమాండ్ పైన ఆందోళనలు కనిపిస్తున్నాయి. దీంతో చమురు ధరలు రెండు శాతం పడిపోయాయి.
6 శాతం పెరిగి, 2 శాతం తగ్గి...
బ్రెంట్ క్రూడాయిల్ ధర నిన్న బ్యారెల్కు 63.27 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డబ్ల్యుటీఐ క్రూడ్ ధర 59.91 డాలర్ల వద్ద ముగిసింది. ఈ రెండింటి ధరలు కూడా అంతకుముందు రోజు ఒక్కొక్కటి ఆరు శాతం చొప్పున పెరిగాయి. నిన్న మాత్రం బ్రెంట్ 1.8 శాతం, తగ్గగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 1.27 శాతం క్షీణించింది.